కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. తుమ్మల మాత్రం వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని ప్రకటించేశారు. ప్రజల కోసమే తన జీవితం కానీ, రాజకీయాల కోసం కాదన్నారు. తల నరుక్కుంటా కానీ, ఎవరికీ తల వంచనని తేల్చి చెప్పేశారు. కొందరు తనను తప్పించాలని చూశారని.. కానీ, ఆత్మగౌరవం కోసమైనా తాను పోటీ చేస్తానని చెప్పారు మాజీ మంత్రి తుమ్మల. భారీ ర్యాలీతో హైదరాబాద్ నుంచి ఖమ్మంకు వచ్చిన ఆయన.. తన అనుచరులతో సమావేశంలో ఇలా సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది.
తుమ్మల టార్గెట్ ఏంటి? ఆయన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి? ఆయన పోటీ ఏ పార్టీ నుంచి? ఇలా రకరకాల చర్చ నడుస్తోంది. పాలేరు నుంచి పోటీ చేయాలని భావించారాయన. కానీ, బీఆర్ఎస్ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్కే కేటాయించారు కేసీఆర్. తుమ్మల బాగా హర్ట్ అయ్యారు. తాజాగా వెయ్యి కార్లు, 2వేల బైకులతో ర్యాలీగా వచ్చి బలప్రదర్శన చేశారు. కేడర్తో మీటింగ్ పెట్టి.. కేసీఆర్కు పరోక్షంగా షాక్ ఇచ్చారు.
వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని చెప్పడం జిల్లా రాజకీయాలను మార్చేసే డైలాగ్. బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు కాబట్టి.. ఇక ఆయన కారు గుర్తుపై పోటీ చేసే ఛాన్స్ లేదు. మరి, కారు దిగేస్తారా? తన రాజకీయ భవిష్యత్తు మరో పార్టీలో కొనసాగిస్తారా? ప్రచారం జరుగుతున్నట్టు తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరుతారా? కాంగ్రెస్ అభ్యర్థిగా పాలేరు నుంచి బరిలో దిగుతారా? అనేది త్వరలోనే క్లారిటీ రానుంది.
అదే జరిగితే.. తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరితే.. మామూలుగా ఉండదు రాజకీయం. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు మరో స్ట్రాంగ్ లీడర్ తుమ్మల నాగేశ్వరరావు సైతం హస్తం కండువా కప్పేసుకుంటే.. ఇక ఖమ్మంలో తిరుగుండదు. 10కి 10. గంపగుత్తగా చేతికి చిక్కినట్టే. కేసీఆర్కు ఇక దబిడి దిబిడే..అంటున్నారు.