Congress: గాంధీభవన్ కి కాంగ్రెస్ ఆశావహులు పోటెత్తారు. దరఖాస్తులకు చివరి రోజు కావడంతో భారీ స్పందన వచ్చింది. వెయ్యికి పైగే దరఖాస్తులు వచ్చినట్లు గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి.
మహబూబాబాద్ జిల్లాలోని ఇల్లందుకు అత్యధిక దరఖాస్తులు దాఖలయ్యాయి. గోషామహల్ కోసమూ చాలామందే పోటీ పడుతున్నారు.
ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేయనున్న వికారాబాద్ జిల్లా కొడంగల్ సీటు కోసం ఒకే ఒక్క అప్లికేషన్ వచ్చింది. ఆ ఒక్కటి కూడా రేవంత్రెడ్డిదే.
అటు, సీఎల్పీ లీడర్ మల్లు భట్టివిక్రమార్క బరిలో దిగనున్న మధిర అసెంబ్లీ సెగ్మెంట్కి సైతం ఆయన ఒక్కరి దరఖాస్తు మాత్రమే వచ్చింది.
కాంగ్రెస్ టికెట్ కోసం భారీగానే పోటెత్తారు ఆశావహులు. ఈసారి పలువురు నేతల వారసులు కూడా బరికి రెడీ అయ్యారు. జానారెడ్డి ఇద్దరు కుమారులు నాగార్జున సాగర్, మిర్యాలగూడల కోసం దరఖాస్తులు దాఖలు చేశారు. సీతక్క ములుగు నుంచి అప్లికేషన్ వేయగా.. ఆమె తనయుడు సూర్య పినపాక కోసం ట్రై చేస్తున్నారు. ఎల్బీనగర్ టికెట్ కోసం మధుయాష్కీగౌడ్ దరఖాస్తు చేయడం ఆసక్తికరంగా మారింది.
ఒక్కో ఎమ్మెల్యే సీటు కోసం యావరేజ్గా 10మంది వరకూ పోటీ పడుతున్నారు. అంటే, కాంగ్రెస్ పార్టీదే గెలుపని నేతలు నమ్ముతున్నట్టేగా? అందుకేగా, కాంగ్రెస్ టికెట్ల కోసం ఇంత పోటీ? అంటున్నారు.
ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను పీసీసీ అధ్యక్షుడి నేతృత్వంలోని పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ స్క్రూటిని చేస్తుంది. అర్హులైన అభ్యర్థుల జాబితాను రూపొందించి కేరళ ఎంపీ మురళీధరన్ నేతృత్వంలో స్క్రీనింగ్ కమిటీకి అప్పగిస్తారు. స్క్రీనింగ్ కమిటీ మరోసారి అభ్యర్థుల బ్యాంగ్ గ్రౌండ్ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నేరుగా అభ్యర్థులను పిలిచి ఇంటర్వ్యూ చేస్తారు. సామాజిక సమీకరణాలు, గెలుపు అవకాశాలు, ఆ సెగ్మెంట్ లోని ప్రత్యర్థి పార్టీ బలాలు, బలహీనతలు బేరీజు వేసుకున్న తర్వాత ప్రతీ నియోజకవర్గం నుంచి 3 పేర్లను సిఫారసు చేస్తూ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి నివేదిస్తారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ముందుకు వచ్చిన స్క్రీనింగ్ కమిటీ నివేదికను మరోసారి పరిశీలించి అభ్యర్థులను ప్రకటిస్తారు. ఏదైనా నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోతే ఆ జాబితాను సీడబ్ల్యూసీ ముందుంచుతారు. అలాంటి సెగ్మెంట్ల అభ్యర్థుల ప్రకటన చివరి జాబితాలో ఉండనుంది.