Thummala Nageswara Rao : ఖమ్మంలో బీఆర్ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు బల ప్రదర్శనకు దిగారు. పాలేరు బీఆర్ఎస్ టికెట్ ఆయన ఆశించారు. కానీ గులాబీ బాస్ .. టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో తుమ్మల అనుచరులు రోడ్డెక్కారు. ఖమ్మంలో భారీగా కార్ల ర్యాలీ తీశారు. ఈసారి పోటీ చేయకపోతే రాజకీయంగా నిలబడలేమంటున్నారు… తుమ్మల అనుచరులు.
బీఆర్ఎస్ కు తుమ్మల గుడ్ బై చెబుతారని టాక్ వినిపిస్తోంది. ఏ పార్టీలోకి వెళ్తారనే చర్చ నడుస్తోంది. అయితే ఆయన కాంగ్రెస్లో చేరతార అని సమాచారం. తుమ్మల పాలేరు నుంచి పోటీ చేస్తారా? ఖమ్మం నుంచి బరిలోకి దిగుతారా? అనేది ఆసక్తిగా మారింది.
గతంలో పాలేరు నుంచి ఓసారి తుమ్మల నాగేశ్వరరావు గెలిచారు. 2019 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న తుమ్మల… తనపై గెలిచిన నాయకుడికి కేసీఆర్ టికెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది. అందుకే ఆయన పాలేరు నుంచి గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నారని సన్నిహతులు చెబుతున్న మాట.
ఖమ్మంలో ఎక్కువగా ముస్లిం, కమ్మ సామాజిక వర్గాల ఓట్లు ఉన్నాయి. ఆ రెండు వర్గాల్లోనూ తుమ్మలకు మంచి పట్టు ఉంది. ఖమ్మం నుంచి బరిలోకి దిగడంపైనా తుమ్మల సమాలోచనలు చేస్తున్నారని తెలుస్తోంది. 2009 ఎన్నికల్లో ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ నుంచి గెలిచారు. గత రెండు పర్యాయాలు అక్కడ నుంచి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మరి తుమ్మల పార్టీ మార్పుపై క్లారిటీ ఇస్తారా? కాంగ్రెస్ లో చేరడం ఖాయమేనా? పోటీ పాలేరు నుంచా? ఖమ్మం నుంచా?