Telangana Secretariat : చాలాకాలం తర్వాత తెలంగాణ గవర్నర్ తమిళిసై , సీఎం కేసీఆర్ ఒకే వేదికపై కలిసి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొడం ఆసక్తిని రేపుతోంది. తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో ప్రార్ధనా మందిరాల ప్రారంభోత్సవానికి గవర్నర్ ను ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ హాజరయ్యారు. నల్లపోచమ్మ ఆలయంలో పూర్ణాహుతి కార్యక్రమంలో కేసీఆర్ తో కలిసి పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
సచివాలయం ప్రాంగణంలో చర్చి ప్రారంభోత్సవంలోనూ గవర్నర్ , సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. గవర్నర్ ను కేక్ కోయాలని కేసీఆర్ కోరారు. ఆమె కేక్ కట్ చేసి తర్వాత కేసీఆర్ సూచనతో చర్చి ఫాదర్ కేక్ పీస్ ఇచ్చారు. ఆ తర్వాత సీఎంకు తమిళ సై కేక్ అందించారు. అక్కడే గవర్నర్ కు కేసీఆర్ జ్ఞాపికను అందించారు. గవర్నర్, సీఎం కలిసి మసీదును కూాడా ప్రారంభించారు. ప్రత్యేక పార్థనల్లో పాల్గొన్నారు.
ప్రభుత్వం ఆహ్వానంతో గవర్నర్ తెలంగాణ నూతన సచివాలయానికి రావడంలో పొలిటికల్ గా ఆసక్తిగా మారింది. సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి తమిళిసైను ఆహ్వానించలేదు. ఆ తర్వాత అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి పిలవలేదు. తనకు ఆహ్వానాలు అందకపోయిన సమయంలో గవర్నర్ బహిరంగగానే ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
కొంతగాలంగా తెలంగాణలో పెండింగ్ బిల్లుల వ్యవహారంపై వివాదం నడుస్తోంది. కొన్ని బిల్లులను గవర్నర్ ఆమోదించలేదు. దీంతో ప్రభుత్వం మళ్లీ ఆ బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ కు పంపింది. తమిళిసై బిల్లులను ఆమోదించకపోవడంపై మంత్రులు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఇలా రాజభవన్, ప్రగతి భవన్ కు మధ్య దూరం పెరిగింది. మరి ఇప్పుడు సచివాలయంలో నిర్మించిన ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవంలో గవర్నర్, కేసీఆర్ కలిసి పాల్గొని పరస్పరం ఎంతో గౌరవభావంతో మెలిగారు. మరి గవర్నర్, సీఎంకు మధ్య సయోధ్య కుదిరిందా? రాజీకి వచ్చారా..? మరి గవర్నర్ బిల్లులను ఆమోదిస్తారా? ఇన్నాళ్లు పొలిటికల్ గేమే నడిచిందా? బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనన్న కాంగ్రెస్ విమర్శలు నిజమేనా?