టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. తాజాాగా ఆయన కొడంగల్లో పర్యటించారు. పలువురి నేతలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో కొండగల్ నుంచే పోటీ చేసి కాంగ్రెస్ జెండా ఎగురేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తాను చేసిన అభివృద్ది తప్ప.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్తగా చేసింది ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించారు.
కొడంగల్ ను దత్తత తీసుకుంటామని మంత్రి కేటీఆర్ చెప్పిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. నియోజకవర్గ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇక్కడ అభివృద్ధి జరిగిందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో కనీసం మండల కేంద్రాల్లో జూనియర్ కళాశాలకు భవనాలు కూడా
నిర్మించలేదని మండిపడ్డారు.
బీఆర్ఎస్ సర్కార్ కొడంగల్ ప్రాంత రైతులను పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. నారాయణ్ పేట్ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయలేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యసేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి నెలా ఒకటో తేదీనే రూ.4 వేలు పెన్షన్ అందిస్తామని ప్రకటించారు. పేదల ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని తెలిపారు. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చారు.
కేసీఆర్ పైనా రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఓటమి భయంతో కేసీఆర్ గజ్వేల్ తోపాటు కామారెడ్డిలో పోటీ చేయబోతున్నారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు సంపాదించిందని ఆరోపించారు. హైదరాబాద్ పరిసరాల్లో 10 వేల ఎకరాలు ఆక్రమించుకున్నారని విమర్శించారు.
రేవంత్ రెడ్డి 2009, 2014 ఎన్నికల్లో కొడంగల్ నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. కానీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా బరిలోకి దిగి ఘన విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి కొడంగల్ నుంచి బరిలోకి దిగేందుకు గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు.