Battini Harinath Goud : చేప ప్రసాదం పంపిణీతో పేరు పొందిన బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూశారు. 84 ఏళ్ల ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఏటా మృగశిర కార్తె నాడు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బత్తిని కుటుంబ సభ్యులు చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఈ చేప ప్రసాదం తీసుకునేందుకు తెలుగురాష్ట్రాలతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భారీగా ఆస్తమా బాధితులు వస్తుంటారు.
హైదరాబాద్ సంస్థానంలో 1847లో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభించారు. ఆ రోజుల్లో వీరన్న గౌడ్ అనే వ్యక్తి ఏటా మృగశిర కార్తె ముందు రోజు నుంచి చేప ప్రసాదం పంపిణీ చేసేవారు. ఆ తర్వాత ఆయన కుమారుడు బత్తిని శివరామ గౌడ్, అతని కుమారుడు బత్తిని శంకర్ గౌడ్ ఈ ప్రసాదాన్ని ఏటా పంపిణీ చేశారు. ఆ తర్వాత శంకర్ గౌడ్ కుమారులు బత్తిని హరినాథ్ గౌడ్, బత్తిని ఉమామహేశ్వర్ గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు.
ఇలా 176 ఏళ్లుగా చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతూనే ఉంది. మధ్యలో కరోనా వల్ల చేప ప్రసాదం పంపిణీ రెండేళ్లపాటు నిలిచిపోయింది. కానీ మళ్లీ ప్రారంభించారు. చేప ప్రసాదం కోసం వచ్చేవారికి ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తోంది.