చంద్రయాన్-3 ప్రయోగంతో సక్సెస్ సాధించిన ఇస్రో మరో ప్రాజెక్టుకు సిద్ధమవుతోంది. సూర్యుడిపై అధ్యయనానికి సన్నద్ధమవుతోంది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ చంద్రయాన్ -3 విజయోత్సవం ప్రసంగంలోనూ తెలిపారు. శుక్ర గ్రహంపైనా అధ్యయనం చేయాలనే ప్రణాళిక ఉందని వెల్లడించారు. ఆదిత్య-ఎల్ 1 ప్రయోగానికి ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ ఉపగ్రహాన్ని శ్రీవారి కోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ కు తీసుకొచ్చారు. సెప్టెంబర్ మొదటివారంలో ఆదిత్య -ఎల్1 ప్రయోగం చేపడతారు. పీఎస్ఎల్వీ-సీ57 వాహకనౌక ద్వారా ఉపగ్రహాన్ని నింగిలోకి పంపుతారు.
సూర్యుడి అధ్యయనం కోసం ఇస్రో చేపడుతున్న తొలి మిషన్ ఆదిత్య -ఎల్1 ప్రయోగం. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని పరిశోధించడమే ప్రయోగ లక్ష్యం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, పలు దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో ఇస్రో సౌర అధ్యయన ప్రక్రియను చేపట్టబోతోంది.
ఈ శాటిలైట్ బరువు 1500 కిలోలు. భూమి నుంచి సూర్యుని దిశగా 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్ పాయింట్ -1 చుట్టూ ఉన్న కక్ష్యలోకి ఆదిత్య-ఎల్1ను ప్రవేశపెడతారు. ఈ కక్ష్యలోకి పంపించడం ద్వారా గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు దొరుకుతుంది. సౌర కార్యకలాపాలపై పరిశోధనలు చేస్తారు. అంతరిక్ష వాతావరణంలో సూర్యుని ప్రభావంపై అధ్యయనం చేస్తారు.
ఏడు పేలోడ్లను ఆదిత్య-ఎల్ 1 మోసుకెళ్లుతుంది. విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ , సోలార్ అల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలీస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్, హైఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, మ్యాగ్నెటోమీటర్ , ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, సోలార్ లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ పేలోడులను అమరుస్తారు.
సూర్యగోళం నుంచి ప్రసరించే కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఈ పేలోడ్లను తయారు చేశారు. ఈ పేలోడ్లు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సాయంతో ఫొటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యుడి వెలుపలి పొరలు, సౌరశక్తి కణాలు, సూర్యుడి అయస్కాంత క్షేత్రాన్ని పరిశీలిస్తాయి.