చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ తో యావత్ భారత్ సంబరాల్లో మునిగిపోయింది. చంద్రుడిపై ల్యాండర్ విక్రమ్ ల్యాండింగ్ ప్రక్రియ సాఫీగా సాగగానే విజయోత్సవాలు అంబరాన్నింటాయి. ల్యాండర్ విక్రమ్ చంద్రుడిపై దిగింది. ఆ తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి అందరీలోనూ ఉంది. ల్యాండర్ ల్యాండింగ్ ప్రక్రియ పూర్తైన తర్వాత దాదాపు నాలుగు గంటలకు ల్యాండర్ ర్యాంప్ విచ్చుకుంది. దానిలో ఉన్న 6 చక్రాల ప్రగ్యాన్ రోవర్ జాబిల్లి ఉపరితలంపైకి వచ్చింది. రోవర్ ప్రగ్యాన్ ..ల్యాండర్ నుంచి కిందకి దిగుతున్న దృశ్యాల వీడియోను ఇస్రో ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
చంద్రుడిపై రోవర్ సెకనుకు సెంటిమీటర్ వేగంతో కదులుతోంది. పరిశోధనలు మొదలుపెట్టింది. రోవర్ ప్రగ్యాన్ వెనక చక్రాలపై ఉన్న భారత జాతీయ చిహ్నం , ఇస్రో ముద్రలను చందమామపై అద్దింది. చంద్రుడిపై గాలి ఉండదు. అందువల్ల ఈ ముద్రలు ఎన్నేళ్లయినా అలాగే జాబిల్లిపై శాశ్వతంగా ఉంటాయి.
జాబిల్లిపై దిగిన విక్రమ్ ల్యాండర్, అందులోని ప్రగ్యాన్ రోవర్ ఒక్క పూట మాత్రమే అక్కడ పని చేస్తాయి. అయితే చంద్రుడిపై ఒక పూట అంటే భూమిపై 14 రోజులకు సమానం. విక్రమ్ ల్యాండర్ దిగే సమయానికే జాబిల్లిపై సూర్యోదయం. 14 రోజులపాటు సూర్యకిరణాల వల్ల వెలుగు ఉంటుంది. అప్పటివరకూ విక్రమ్, ప్రగ్యాన్ పరిశోధనలు చేస్తాయి.
చంద్రుడిపై పగటి పూట విపరీతమైన ఎండ ఉంటుంది. సుమారు 170 డిగ్రీల సెల్సియస్ నమోదువుతుంది. అయితే రాత్రివేళ మాత్రం ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోతాయి. మైనస్ 180 డిగ్రీల సెల్సియస్ కు చేరతాయి. అలాంటి స్థితిలో ల్యాండర్, రోవర్లలోని వ్యవస్థలు పనిచేయడం దాదాపు అసాధ్యమని ఇస్రో శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 14 రోజుల తర్వాత మళ్లీ ఎండ వచ్చినప్పుడు అవి పనిచేస్తే.. మరో 14 రోజులు పరిశోధనలు చేసే అవకాశం దక్కుతుంది.