Patnam Mahender Reddy : ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డిని మంత్రి పదవి వరించబోతోంది. గురువారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ఆయన మంత్రిగా ప్రమాణం చేస్తారు. ఈ విషయాన్ని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి వెల్లడించారు. మహేందర్రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
ఈటల రాజేందర్ను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేయడంతో ఒక స్థానం ఖాళీ అయ్యింది. అప్పటి నుంచి ఆయన స్థానంలో ఎవర్నీ తీసుకోలేదు. తాజాగా బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్.. పట్నం మహేందర్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వలేదు. ఆయన గత ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గంలో ఓడిపోయారు. మహేందర్ రెడ్డిపై గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆ తర్వాత కారెక్కారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రోహిత్ రెడ్డికే బీఆర్ఎస్ టిక్కెట్ దక్కింది.
మరోవైపు కొన్నిరోజుల క్రితం మహేందర్ రెడ్డి పార్టీ మారుతున్నారని వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరిగింది. ఆ వార్తల నేపథ్యంలో బీఆర్ఎస్ అధిష్టానం పట్నంతో చర్చలు జరిపింది. కారు దిగకుండా ఆయనకు మంత్రి పదవి ఆఫర్ చేసింది. ఈ నేపథ్యంలో మహేందర్రెడ్డిని కేబినెట్ లోకి తీసుకోవాలని గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయించారు.
మంత్రివర్గ విస్తరణపై ఇప్పటికే ప్రభుత్వం నుంచి గవర్నర్ కార్యాలయానికి సమాచారం పంపారు. దీంతో మహేందర్రెడ్డి మంత్రిగా ప్రమాణం చేయడానికి అవసరమైన ఏర్పాట్లను రాజ్భవన్ చేసింది. ఇప్పుడు పట్నంకు కేసీఆర్ ఏ శాఖను కేటాయిస్తారనే ఆసక్తి నెలకొంది.