BRS: మహిళా సర్పంచిని వేధించారని ఆరోపణలు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో విభేదాలు. మాటల యుద్ధం, వర్గపోరు మంటలు.. స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య టికెట్ ఆశల్ని ఆవిరి చేశాయి. సీఎం కేసీఆర్పై భక్తిని చాటుకుంటూ.. దీక్ష చేసినా అధినేతను ప్రసన్నం చేసుకోలేకపోయారు. యాగాలు ఫలించలేదు. కేసీఆర్ కరుణించలేదు. రాజయ్యకు కన్నీరే మిగిలింది. టికెట్ రాలేదదని తెలిసినప్పటి నుంచి రాజయ్య బోరున విలపిస్తున్నారు. ప్రజలతోనే ఉంటానని అనుచరులతో చెప్పిన రాజయ్య.. పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారని కూడా స్టేషన్ఘన్పూర్లో చర్చ నడుస్తోంది.
అలిగిన రాజయ్యను బుజ్జగించేందుకు బీఆర్ఎస్ అధిష్ఠానం రంగంలోకి దిగింది. రాజయ్య కారు దిగకుండా కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉండే ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డితో రాయబారం నడుపుతోంది. హన్మకొండలోని రాజయ్య ఇంటికి పల్లా వెళ్లారు. పల్లా వస్తున్న విషయం తెలిసి.. రాజయ్య తన ఇంటి నుంచి జంప్ అయ్యారు. ఇంట్లో రాజయ్య లేకపోవడంతో.. ఆయన అనుచరులతో సమావేశమైన పల్లా.. రాజయ్యకు అధిష్ఠానం సముచిత స్థానం కల్పిస్తుందని చెప్పారు.
అయితే, రాజయ్య తాను బీఆర్ఎస్లో ఉండాలా? లేదంటే కారు దిగేయాలా? అనే సందిగ్థంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇండిపెండెంట్గా పోటీ చేయలేరు. కాంగ్రెస్లోకి వెళ్తే టికెట్ వస్తుందనే గ్యారెంటీ లేదు. బీజేపీలోకి వెళ్లలేరు. వాట్ నెక్ట్స్? అనేది తేల్చుకోలేకపోతున్నారని అంటున్నారు. గతంలో డిప్యూటీ సీఎం పదవి నుంచి కేసీఆర్ గెంటేసినా.. మౌనంగా ఉండటంతో మరోసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఈసారి కూడా అలానే కామ్గా పడుంటే.. ఫ్యూచర్లో ఏ ఎమ్మెల్సీనో ఇవ్వకపోతారా? అనే భావనలో ఉన్నారట రాజయ్య.
మరోవైపు.. తీవ్ర ఉత్కంఠ, పోటీ మధ్య ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న కడియం శ్రీహరి వర్గంలో ఆనందం వెల్లివిరుస్తోంది. అభిమాన నేతకు అధిష్ఠానం టికెట్ ఇవ్వడం పట్ల అనుచరులు ఉత్సాహం కనబరుస్తున్నారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికలకు మూడు నెలల ముందే టికెట్లు ప్రకటించి.. సమరానికి సై అంటూ కేసీఆర్ సమరశంఖం పూరించారు. ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. గుర్రుగా ఉన్న నేతల మౌనం గులాబీ పార్టీకి గుబులు పుట్టిస్తుంటే.. కారు దిగేందుకు సిద్ధమైన నేతల్ని కలుపుకొని పోయేందుకు విపక్షాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.