వేముల వీరేశం. విప్లవ పంథా. ఉద్యమ ప్రస్థానం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా దూకుడు రాజకీయం చేశారు. గత ఎన్నికల్లో నకిరేకల్ నుంచి ఓడిపోయారు. ఇక అంతే. ఖేల్ ఖతం. కేసీఆర్ ఆయన్ను పూర్తిగా పక్కన పెట్టేశారు. మళ్లీ కోలుకోనే లేదు. తనను ఎదగకుండా తొక్కేశారనేది వీరేశం ఆరోపణ. ఈసారి ఏకంగా టికెటే రాకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తన ఎదుగుదలను చూసి ఓర్వలేక పార్టీలో ప్రముఖ స్థానంలో ఉన్న ఓ వ్యక్తి తనపై కుట్రపన్నారని ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి తనను దూరం చేస్తున్నారని.. తనకు టికెట్ ఇవ్వకుండా పార్టీ పెద్ద తప్పు చేసిందని అంటున్నారు. ఆయన మాటలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
వేముల వీరేశంకు బీఆర్ఎస్ టికెట్ రాకుండా అడ్డుకున్నది ఎవరు? అగ్రెసివ్ లీడర్గా పేరున్న ఆయన్ను.. అడ్డుకుంటున్నది ఎవరు? అనే చర్చ నడుస్తోంది. ఇంకెవరూ మంత్రి జగదీశ్రెడ్డే అంటున్నారు ఆయన అనుచరులు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తనకు పోటీ వస్తాడనే భయంతోనే.. వేముల వీరేశంకు టికెట్ ఇవ్వకుండా మంత్రి జగదీశ్రెడ్డి కుట్ర చేశారని అంటున్నారు.
నకిరేకల్ టికెట్ రాకపోవడంపై ఆగ్రహంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే.. BRSకు రాజీనామా చేసి పడేశారు. కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్లో చేరిన చిరుమర్తి లింగయ్యకే టికెట్ ఖరారు చేయడంతో వీరేశం బాగా హర్ట్ అయ్యారు. ఇలాంటి పార్టీతో తాను ఉండలేనంటూ.. కారు దిగేశారు. విషయం తెలిసి.. వెంటనే అప్రమత్తమైన అధిష్టానం.. ఆయన్ను బుజ్జగించడానికి ప్రయత్నాలు చేస్తోంది. రానున్న రోజుల్లో మంచి అవకాశాలు కల్పిస్తామని జిల్లాలోని సీనియర్లు వీరేశంకు నచ్చజెబుతున్నారు.
మరో వారం, పది రోజుల్లో భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానన్నారు వేముల వీరేశం. అయితే, ఆయన కాంగ్రెస్లో చేరాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలతో టచ్లోకి వెళ్లారని.. టాక్స్ నడుస్తున్నాయని తెలుస్తోంది.
గత ఎన్నికల్లో ఓడిపోయి.. ఐదేళ్లు ఖాళీగా ఉన్న వీరేశానికి ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి. ఆయన పొలిటికల్ ఫ్యూచర్ను డిసైడ్ చేసే టైమ్ ఇది. అందుకే ఏమాత్రం ఛాన్స్ తీసుకోకుండా కాంగ్రెస్ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.
మరోవైపు, నకిరేకల్ టికెట్ను చెరుకు సుధాకర్ ఆశిస్తున్నారు. ఆ హామీతోనే ఆయన మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్లో చేరారు. అయితే, చెరుకు సుధాకర్కి భువనగిరి లేదా ఆలేరు నుంచి అవకాశం కల్పిస్తారని.. వీరేశంకే నకిరేకల్ సీటు ఇస్తారని అంటున్నారు. వేముల వీరేశం లాంటి డైనమిక్ లీడర్ కాంగ్రెస్లో చేరితే.. బీఆర్ఎస్ ఇబ్బంది తప్పకపోవచ్చు. అందుకే, బీఆర్ఎస్ అధిష్టానం.. తాయిలాలతో బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది. మరి, వీరేశం నిర్ణయం ఎలా ఉంటుందోననే ఉత్కంఠ ఉమ్మడి నల్గొండలో కొనసాగుతోంది.