మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏకంగా తెలంగాణ ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ జయకుమార్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఎన్నికల అఫిడవిట్ కేసులో 10మంది ఈసీ అధికారులపై కేసులు నమోదు చేయాలన్న ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం ఆసహనం వ్యక్తం చేసింది. రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై కేసులకు ఎలా ఆదేశిస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్పై కేసులు నమోదు చేయాలని ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో సుప్రీంకోర్టుకు వెళ్లింది ఎలక్షన్ కమిషన్. సీఈసీ లేవనెత్తిన అంశాలు పరిగణలోకి తీసుకోని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి జయకుమార్ ఇచ్చిన తీర్పు అనివార్యమంటు జయకుమార్ ని సస్పెండ్ చేసింది సుప్రీం కోర్టు.
మరోవైపు.. అఫిడవిట్ కేసులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ని జిల్లా పోలీసులు కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారని కోర్టును ఆశ్రయించారు పిటిషనర్ రాఘవేందర్ రాజు. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద టూటౌన్ పోలీసులు రాఘవేందర్ రాజుకు నోటీసులు జారీ చేశారు. వాటిని సవాల్ చేస్తూ రాఘవేందర్ రాజు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశారాయన. ఈ కేసు నుంచి శ్రీనివాస్ గౌడ్ని తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని రాఘవేందర్ రాజు వాదిస్తున్నారు. తదుపరి విచారణ ఈనెల 28కి వాయిదా పడింది.