Tirumala : తిరుమల నడక మార్గంలో చిరుతల సంచారం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ ఆపరేషన్ చిరుత చేపట్టింది. మంగళవారం రాత్రి చిరుత బోనులో చిక్కినట్టే చిక్కి మిస్సైంది. అలాగే ఓ ఎలుగుబంటి కూడా తప్పించుకుంది. చిరుత, ఎలుగుబంటిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు విఫలమయ్యాయి. దాదాపు 100 మంది సిబ్బంది ఈ ఆపరేషన్ ను అటవీ ప్రాంతంలో చేపట్టారు. అయితే ట్రాప్ నుంచి చిరుత, ఎలుగుబంటి తప్పించుకున్నాయి.
చిరుత బోన్కు సమీపంలోనికి వచ్చింది. లోనికి వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే చివరి క్షణంలో వెనక్కి వెళ్లింది. మరోవైపు ఎలుగుబంటికి మత్తు ఇచ్చారు. దానిని ట్రాప్ చేసేందుకు అటవీశాఖ సిబ్బంది ప్రయత్నించారు. కానీ వెలుగుబంటి తప్పించుకుంది. అక్కడ అటవీప్రాంతంలోనికి వెళ్లిపోయింది.
చిరుత, ఎలుగుబంటిని పట్టుకుంటే అలపిరి నడక మార్గంలో భక్తుల్లో భయాలు తొలుగుతాయని టీటీడీ భావిస్తోంది. వన్య మృగాల నుంచి ప్రమాదం తప్పుతుందని అటవీశాఖ అధికారులు అంటున్నారు. చిరుత, ఎలుగుబంటి ఎలాగైనా పట్టుకునేందుకు అటవీశాఖ సిబ్బంది ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.