దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇప్పుడు చంద్రయాన్ మాటే వినిపిస్తోంది. ఈ ప్రయోగం సక్సెస్ కోసం యావత్ భావతావని ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఇది చంద్రుడిపై పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన మూడో లూనార్ మిషన్. ఈ ప్రయోగాలకు తొలుత చంద్రయాన్ అని పేరు ప్రతిపాదనలో లేదు. అప్పటి ప్రధాని వాజ్ పేయీ సూచనతో చంద్రయాన్ మార్చారు. ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కె. కస్తూరిరంగన్ నాటి సంగతులను తాజాగా వెల్లడించారు.
1999లో ఇస్రో ఛైర్మన్గా కస్తూరి రంగన్ ఉన్నారు. తొలి లూనార్ మిషన్ ప్రయోగం అనుమతుల కోసం కేంద్రాన్ని ఆయన సంప్రదించారు. ఆ సమయంలో ప్రధానిగా అటల్ బిహారి వాజ్పేయీ ఉన్నారు. వాజ్ పేయీ మిషన్ పేరు గురించి కస్తూరి రంగన్ ను వివరాలు అడిగారు. ఈ ప్రయోగానికి సోమయాన్ అని పేరు పెట్టాలనుకున్నామని కస్తూరి రంగన్ చెప్పారు. సంస్కృతంలో ఓ శ్లోకం ఆధారంగా ఈ పేరు పెట్టాలనుకున్నామని వివరించారు. ఓ చంద్రుడా మా మేధస్సుతో నిన్ను చేరుకోవాలనుకుంటున్నాం.. మాకు దారిచూపు అని ఈ శ్లోకానికి అర్థమని వివరించారు. అందుకే ఆ పేరు పెట్టామని కస్తూరిరంగన్.. వాజ్పేయీకి చెప్పారు.
అప్పటి ఇస్రో ఛైర్మన్ కస్తూరి రంగన్ చెప్పిన విషయాలు విన్న తర్వాత వాజ్పేయీ తన అభిప్రాయాన్ని చెప్పారు. లూనార్ మిషన్కు చంద్రయాన్ పేరును సూచించారు. ప్రస్తుతం దేశం ఆర్థికశక్తిగా అవతరిస్తోందని, భవిష్యత్తులో చంద్రుడిపైకి మరిన్ని యాత్రలు చేయగలిగే సత్తా మనదేశానికి వస్తుందని వాజ్పేయీ ఆనాడు చెప్పారని కస్తూరిరంగన్ నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు.
2003 ఆగస్టు 15న వాజ్పేయీ ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో చంద్రయాన్ ప్రయోగాన్ని అధికారికంగా ప్రకటించారు. దేశం శాస్త్ర, సాంకేతిక రంగంలో అత్యున్నతస్థాయికి ఎదగడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. 2008 నాటికి వ్యోమనౌకను జాబిల్లిపైకి పంపుతామని ప్రకటించారు. ఆ మిషన్ పేరు చంద్రయాన్ అని వాజ్పేయీ నాడు ప్రకటన చేశారు.
వాజ్పేయీ ప్రకటించిన విధంగా 2008లో చంద్రయాన్-1 ప్రయోగం చేపట్టారు. జాబిల్లి ఉపరితలంపై నీటి జాడలను గుర్తించారు. ఆ ప్రయోగం ఇలా సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత 2019లో చంద్రయాన్-2 ప్రయోగం చేపట్టారు. చంద్రుడి ఉపరితలంలో ల్యాండింగ్ సమయంలో సమస్యలు తలెత్తడంతో ఈ ప్రయోగం విఫలమైంది. ఇప్పుడు ఇస్రో చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టింది.