చంద్రయాన్-3 ప్రయోగంపై అన్ని దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. భారత్ కు బెస్ట్ విషెష్ చెబుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో దాయాది దేశం పాకిస్థాన్ కూడా చేరింది. పాకిస్థాన్ మాజీ మంత్రి ఫవాద్ ఛౌదరి చంద్రయాన్-3 మిషన్ పై ప్రశంసలు కురిపించారు. భారత్ ను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
చంద్రయాన్-3 ల్యాండింగ్ దృశ్యాలను పాకిస్థాన్ మీడియా కూడా ప్రసారం చేయాలని ఫవాద్ ఛౌదరీ సూచించారు. విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ అయ్యే సమయం భారత అంతరిక్ష రంగానికి చరిత్రాత్మక క్షణాలుగా పేర్కొంటూ ట్విట్టర్ లో అభినందనలు తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఫవాద్ చౌదరి సమాచార, ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు.
భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3 ఆగస్టు 23న చందమామ దక్షిణ ధ్రువం వద్ద దిగనుంది. సాయంత్రం 5.20 గంటల నుంచి ఇస్రో ఈ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రో శాస్త్రవేత్తలతో వర్చువల్గా ఈ ల్యాండింగ్ క్షణాలను తిలకించనున్నారు. దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లోనూ ల్యాండర్ విక్రమ్ జాబిల్లిపై ల్యాండింగ్ అయ్యే ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ జరిగితే చంద్రుడి పై ల్యాండర్-రోవర్ను పంపిన నాలుగో దేశంగా నిలుస్తుంది. ఇప్పటికే అమెరికా, రష్యా, చైనా ఈ ఘనత సాధించారు. అలాగే చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలిదేశంగా సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది.