ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన తర్వాత బీఆర్ఎస్లో రేగిన ఆగ్రహ జ్వాలలను చల్లార్చేందుకు అధిష్టానం ప్రయత్నిస్తోంది. టిక్కెట్ ఆశించి భంగపడ్డ నేతలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది. మాట వినని వారిపై చర్యలకు సిద్ధమవుతోంది. అలాంటి నేతల విషయంలో కఠినంగానే వ్యవహరించాలని గులాబీ బాస్ కేసీఆర్ భావిస్తున్నారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ధిక్కార స్వరం వినిపిస్తే వేటు వేస్తామని సంకేతాలు బలంగా ఇవ్వాలనే యోచన ఉన్నట్లు తెలుస్తోంది.
మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు విషయంలోనూ కఠినంగా వ్యవహరించాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. తన కుమారుడికి మెదక్ టిక్కెట్ ఇవ్వకపోవడంతో మైనంపల్లి అలకబూనారు. మంత్రి హరీశ్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలను కేటీఆర్, కవిత ఖండించారు. అయినా సరే మైనంపల్లి వెనక్కితగ్గేది లేదన్న విధంగా వ్యవహరిస్తున్నారు. తాను పార్టీపైనా, సీఎం కేసీఆర్ పైనా ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని అంటున్నారు. తిరుపతి టూర్ లో ఉన్న సమయంలో హైదరాబాద్ వెళ్లాక కార్యాచరణ ప్రకటిస్తానని మైనంపల్లి చేసిన కామెంట్స్ ను బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది.
మైనంపల్లికి మల్కాజ్ గిరి టిక్కెట్ ను ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు. అయితే ఆయన వ్యవహారశైలితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ అధిష్టానం.. వేటుకు రంగం సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. ఆయన స్థానంలో మరొకరికి టిక్కెట్ ఇచ్చే అంశాన్ని కేసీఆర్ పరిశీలిస్తున్నారని సమాచారం. ఇప్పటికే తెరపైకి కొందరి నేతల పేర్లు వచ్చాయని టాక్. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, బీఆర్ఎస్ మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇన్చార్జ్ మర్రి రాజశేఖర్రెడ్డి పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత భర్త మోతె శోభన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు విజయశాంతి పేర్లు చర్చకు వచ్చాయని అంటున్నారు.
మరోవైపు మైనంపల్లి తన అనుచరులతో సమావేశం అయిన తర్వాత మల్కాజ్ గిరి వ్యవహారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మైనంపల్లికి కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చిందని తెలుస్తోంది. మైనంపల్లికి మల్కాజ్ గిరి , ఆయన కుమారుడికి మెదక్ సీట్లు ఇస్తే పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం.