Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. 191వ రోజు గన్నవరంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ మీటింగ్ కు టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. సభా వేదికపై లోకేశ్ వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో యువగళం యాత్ర పూర్తైన తర్వాత వైసీపీ నేతలు తనను విమర్శించేవారని లోకేశ్ గుర్తు చేశారు. కానీ ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి తాను రాకముందే అధికార పార్టీ నేతలు ప్యాంట్లు తడుపుకున్నారని సెటైర్లు వేశారు. లోకేశ్ క్షమాపణ చెప్పిన తర్వాతే అడుగు పెట్టాలని హెచ్చరించారని మండిపడ్డారు. అమ్మలాంటి అమరావతిని సీఎం జగన్ చంపేస్తుంటే.. చప్పట్లు కొట్టిన నాయకులు కృష్ణా జిల్లా ప్రజలకు ముందు క్షమాపణ చెప్పాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
తెలుగుదేశం పార్టీకి గన్నవరం కంచుకోట అని లోకేశ్ అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య, దాసరి బాలవర్ధన్రావు లాంటి ఎంతోమంది గొప్పవాళ్లు గన్నవరం ఎమ్మెల్యేలుగా గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు. ఇంత చరిత్ర ఉన్న గన్నవరంలో తాము చేసి తప్పు వల్ల ఓ పిల్ల సైకో ఎమ్మెల్యే అయ్యాడని వల్లభనేని వంశీని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. గన్నవరంలో మళ్లీ అలాంటి తప్పు చేయమని ప్రజలకు హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే మహానటుడని వంశీపై సెటైర్లు వేశారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు తన ఛాంబర్లోకి వచ్చి.. సార్, సార్ అని నిల్చునేవాడని గుర్తు చేసుకున్నారు. కూర్చోమన్నా.. నిల్చునే ఉండేవారని వివరించారు.
2012లో కృష్ణా జిల్లాకు సగం దరిద్రం పోయిందని కొడాలి నాని ఉద్దేశించి లోకేశ్ విమర్శలు చేశారు. ఇప్పుడు వంళీ పార్టీ నుంచి వెళ్లిపోవడంతో మిగిలిన సగం దరిద్రం పోయిందని విమర్శలు గుప్పించారు. తన గెలుపు కోసం పనిచేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి జైలుకు పంపించారని మండిపడ్డారు. వంశీకి భయం పరిచయం చేస్తానని హెచ్చరించారు. నిజమైన షాక్ ట్రీట్మెంట్ ఇచ్చే బాధ్యత తనదేనని లోకేశ్ స్పష్టం చేశారు.