Bandi Sanjay: ఫైర్ బ్రాండ్ లీడర్ బండి సంజయ్ తిరుమల అంశంపై స్పందించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో.. టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
ఏపీ సీఎం జగన్.. టీటీడీ ఛైర్మన్ పదవిని అన్యమతస్తులకు కట్టబెట్టారని బండి సంజయ్ ఆరోపించారు. భూమన కరుణాకర్రెడ్డి తన కూతురు వివాహం ఏ మత సంప్రదాయ ప్రకారం చేశారని ప్రశ్నించారు. తాను నాస్తికుడిని అని ఆయన గతంలో చెప్పలేదా? ఆయన రాడికల్ కాదా? అని నిలదీశారు. తిరుమలకు భక్తులు రాకుండా కుట్ర చేస్తున్నారంటూ కలకలం రేపారు.
కొండల మీద అడవులు లేవని టీటీడీ ఛైర్మన్ ఎలా అంటారని.. అడవులు లేకపోతే పులులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. కొండపై అడవులు ఉన్న విషయం తెలీని టీటీడీ ఛైర్మన్కు పుష్ప సినిమా చూపించాలంటూ పంచ్లు వేశారు బండి సంజయ్.
నడక మార్గంలో పులులు చంపుతున్నాయని.. పాములు కరుస్తున్నాయని.. ఏపీ ప్రభుత్వం భక్తుల్ని భయపెడుతోందని మండిపడ్డారు బండి సంజయ్. భక్తులను కాపాడలేక కర్రలిస్తారా? అంటూ ఫైర్ అయ్యారు. వెంకటేశ్వర స్వామిని అవమానిస్తే పుట్టగతులుండవనే సంగతి గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వం హిందూ మతానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని.. అలా చేసే వారిని దేవుడే చూసుకుంటాడని అన్నారు.