CPI CPM: కేసీఆర్ అడ్డంగా మోసం చేశాక కమ్యూనిస్టులకు జ్ఞానోదయం అయింది. ఇంత దారుణ పరభవమా అంటూ కామ్రేడ్లు అంతా కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. ముందు ఎవరికివారే సీపీఐ, సీపీఎమ్ నేతలు చర్చించుకున్నారు. ఆ తర్వాత అంతాకలిసి మళ్లీ మంతనాలు జరిపారు. కేసీఆర్ చేసిన మోసంపై తెగ ఇదైపోయారు.
అయితే, కేసీఆర్ను వ్యక్తిగతంగా తిట్టబోమని, విధానపరంగా వ్యతిరేకిస్తామని సీపీఐ, సీపీఎం నేతలు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో తమకేమీ నష్టం లేదని.. నష్టపోయేది ఆయనే అంటూ విమర్శించారు. మునుగోడు ఎన్నికల్లో తప్పనిసరి పరిస్థితుల్లోనే బీఆర్ఎస్కు మద్దతిచ్చామని..
బీజేపీతో దగ్గర కావాలనుకునే తమతో పొత్తును వదులుకొని ఉండవచ్చని ఆరోపించారు. వామపక్షాలు లేకపోతే మునుగోడులో బీఆర్ఎస్ పరిస్థితి ఏమయ్యేదో సీఎం కేసీఆర్కు బాగా తెలుసన్నారు కూనంనేని. సీఎం కేసీఆర్ తమను అవసరానికి వాడుకున్నారని విమర్శించారు.
బీజేపీతో బీఆర్ఎస్కు సఖ్యత ఏర్పడిందన్నారు కామ్రేడ్లు. కేసీఆర్ మిత్ర ధర్మం పాటించరా? అని ప్రశ్నించారు. రాజకీయం అంటేనే మోసం అనే నిర్వచనం ఇస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఏక పక్ష నిర్ణయం తీసుకున్నారని.. కమ్యూనిస్టుల సత్తా ఏంటో చూపిస్తామని సవాల్ చేశారు.
వచ్చే ఎన్నికల్లో సీపీఐ-సీపీఎం ఉమ్మడిగా కలిసేపోటీ చేస్తాయని.. ఎన్ని సీట్లలో పోటీ చేయాలనేది త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. ఎవరైనా కలిసొస్తే పోటీ చేస్తామని.. లేదంటే ఒంటరిగా బరిలో దిగుతామని చెప్పారు.