తుమ్మల నాగేశ్వరరావు చుట్టూ ఖమ్మం రాజకీయాలు తిరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా బలమైన నేతగా ఉన్న మాజీ మంత్రి తుమ్మలను గులాబీ బాస్ దూరం పెట్టారు. బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్టులో తుమ్మల పేరు లేదు. పాలేరు నుంచి మళ్లీ కందాల ఉపేందర్కే టికెట్ కేటాయించారు. దీనిపై తుమ్మల వర్గీయులు భగ్గుమంటున్నారు.
పార్టీ ఏదైనా పాలేరులో తుమ్మల పోటీ ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే హైదరాబాద్లో తన సన్నిహితులతో భేటీ అయ్యారు. అటు, జిల్లాలో ఆయన అనుచరవర్గమంతా ప్రత్యేక సమావేశాలు జరుపుతున్నారు. తుమ్మల పోటీలో ఉండాల్సిందేనని పట్టుబడుతున్నారు.
మరోవైపు తుమ్మలను బుజ్జగించేందుకు హరీష్రావు రంగంలోకి దిగినట్టు సమాచారం. తుమ్మలను పార్లమెంటుకు పోటీ చేయించేలా కేసీఆర్ ఆలోచిస్తున్నారని చెబుతున్నారు. ఎంపీ సీటు సాధ్యం కాకపోతే.. ఈసారి పక్కాగా ఎమ్మెల్సీ ఇచ్చి.. మంత్రి పదవి కూడా కట్టబెడతామంటూ హరీశ్ భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది.
అటు తుమ్మల ఆప్తులు.. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులతో మంతనాలు నిర్వహిస్తున్నారు. బీజేపీ సైతం తుమ్మలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. అవసరమైతే బీజేపీ రాష్ట్ర స్థాయిలో పదవిని కట్టబెట్టి.. ఉమ్మడి ఖమ్మం జిల్లా బాధ్యతలు అప్పగించేలా బంపర్ ఆఫర్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం.. ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ స్వయంగా తుమ్మలతో టచ్లోకి వెళ్లారని అంటున్నారు. పొంగులేటి మిస్ అయినా.. తుమ్మలనైనా బీజేపీలో చేర్చుకోవాలని ఈటల గట్టి ప్రయత్నమే చేస్తున్నారని టాక్.