ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్ ప్రకటించగానే బీఆర్ఎస్ లో అలజడి రేగింది. టిక్కెట్ దక్కని నేతలు గళం విప్పారు. పార్టీ అధిష్టానంపై తిరుబాటు ఎగురవేస్తున్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ బీఆర్ఎస్కి షాకిచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు. అయితే ఆమె కాంగ్రెస్లో చేరకుండానే టికెట్కు దరఖాస్తు చేసుకోవడం చర్ఛనీయాంశమైంది. ఖానాపూర్ లో రేఖానాయక్ స్థానంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్నిహితుడు జాన్సన్ నాయక్కు టికెట్ ఇచ్చారు. దీంతో మనస్థాపం చెందిన ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇక కారు దిగిపోవాలని నిర్ణయించుకున్నారు.
మరోవైపు సీనియర్ నేత మాల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వెనక్కి తగ్గేదేలే అంటున్నారు. సోమవారం మంత్రి హరీష్రావు పై చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని వివరణ ఇచ్చారు. తన కుమారుడు రోహిత్ చాలా సేవా కార్యక్రమాలు చేసేశాడని అందుకే మెదక్ టికెట్ ఆశించానని తెలిపారు. పోటీ విషయంలో మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. మెదక్ లో రోహిత్ పోటీ చేయడం ఖాయమని స్పష్టం చేశారు. మెదక్, మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని మైనంపల్లి తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ లో అసమ్మతి రచ్చకెక్కింది. వేములవాడ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు టికెట్ దక్కలేదు. దీంతో ఆయన అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జర్మనీ నుంచి బుధవారం వేములవాడకు రానున్నారు. అనుచరులతో సమావేశం తర్వాత చెన్నమనేని రమేశ్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది.
నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగలనుంది. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పార్టీ వీడతారని ప్రచారం జరుగుతోంది. నకిరేకల్ టికెట్ ను ఆశించి భంగపడ్డ ఆయనను బుజ్జగింపు చర్యలను బీఆర్ఎస్ అధిష్టానం చేపట్టింది. అయితే వేముల వీరేశం మాత్రం వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగాలనే గట్టిగానే నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఆయన అనుచరులు కూడా కాంగ్రెస్ లో చేరి పోటీ చేయాలని కోరుతున్నారు. దీంతో వేముల వీరేశం బుధవారం నకిరేకల్ లో తన అనుచరులతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తారని తెలుస్తోంది.
పెద్దపల్లిలో బీఆర్ఎస్ టికెట్ను నల్లా మనోహర్ రెడ్డి, జూలపల్లి జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ ఆశించారు. టిక్కెట్ రాకపోవడంతో ఇప్పటికే నల్ల మనోహర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొరుకంటి చందర్కు వ్యతిరేకంగా నిరసన గళం వినిపిస్తున్నారు నేతలు.
ఇప్పటికే కోరుకంటికి వ్యతిరేకంగా TGKS నేత రాజిరెడ్డి, మనోహర్ రెడ్డి, పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, మాజీ మేయర్ లక్ష్మీనారాయణ పాదయాత్ర కూడా చేశారు. రామగుండం అసమ్మతి నేతలను హైదరాబాద్కు పిలిపించుకుని కేటీఆర్ మాట్లాడారు. కానీ ఇప్పుడు మళ్లీ చందర్కే టికెట్ ఇవ్వడంతో అసమ్మతి నేతలు భగ్గుమంటున్నారు. ఇలా చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. సీటు దక్కని సిట్టింగులు, గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన నేతల నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలు రేగుతున్నాయి.