Tirumala : తిరుమల శ్రీవారి భక్తలకు శుభవార్త. శ్రీనివాసుడి సన్నిధిలో ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సెప్టెంబర్ 18న ధ్వజారోహణంతో వేడుకలు ప్రారంభమవుతాయి.
సెప్టెంబర్ 22న గరుడవాహన సేవ, 23న స్వర్ణరథం, 25న రథోత్సవం, 26న చక్రస్నానం, ధ్వజావరోహణం నిర్వహిస్తారు. దీంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 15 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు. అక్టోబర్ 19న గరుడ వాహనసేవ, 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల సమయంలో సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు, అక్టోబర్ 15 నుంచి 23 వరకు అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్ద చేసింది. ముందుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులను మాత్రం నిర్దేశిత వాహన సేవకు అనుమతిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల అంకురార్పణ రోజు అక్టోబర్ 14న సహస్ర దీపాలంకార సేవ నిర్వహించరు.