BRS Women MLA candidates : మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పీచ్లు ఇస్తారు బీఆర్ఎస్ నేతలు. ఇక గులాబీ బాస్, సీఎం కేసీఆర్ కూతురు కవిత అయితే.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటాలు చేశారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం దేశ రాజధాని ఢిల్లీలో కూడా ధర్నా నిర్వహించారు. ఆడబిడ్డల సంక్షేమమే లక్ష్యమని కొందరు.. మహిళల బిల్లు కోసం అలుపెరగని పోరాటం చేస్తామని మరికొందరు.. ఇలా గులాబీ నేతలైతే ఇవ్వని స్పీచ్ లేదు. ఇలా మాటలు ఎన్ని మాట్లాడినా.. చేతల వద్దకు వచ్చేసరికే సీన్ మారుతుంది. ఎందుకంటే దానికి పూర్తి రివర్స్గా ఉంటున్నాయి గులాబీ నేతల పనులు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సీఎం కేసీఆర్ అనౌన్స్ చేసిన ఫస్ట్ లిస్ట్.
తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో మహిళలకు చట్ట సభల్లో 33 శాతం టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్.. చేతల పార్టీ అయితే 39 సీట్లు కేటాయించాలి. కానీ కేటాయించింది మాత్రం కేవలం ఏడు సీట్లు మాత్రమే. అంటే 6 శాతం సీట్లు మహిళలకు దక్కాయి. మరి దీనిని ఏమంటారని ప్రశ్నిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
బీఆర్ఎస్ ఫస్ట్లిస్ట్ను గమనిస్తే.. అసలు మహిళా కోటా అనేదే కనిపించడం లేదు. అసిఫాబాద్ నుంచి కోవాలక్ష్మి, మెదక్ నుంచి పద్మాదేవేందర్రెడ్డి.. మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి, కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత, ఆలేరు నుంచి గొంగిడి సునీత, ములుగు నుంచి బడే నాగజ్యోతి, ఇల్లందు నుంచి హరిప్రియనాయక్కు మాత్రమే టికెట్లు దక్కాయి. వీరిని తప్పించి మహిళలకు టికెట్ కేటాయించిన దాఖలాలు లేవనే చెప్పాలి.
మరి 33 శాతం సంగతేంటని ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు. ఈడీ కేసుల్లో కవితను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరిగినప్పుడు మహిళా బిల్లు అంశం తెరపైకి వచ్చిందే తప్ప.. వారికి ఎలాంటి చిత్తశుద్ధి లేదన్న విమర్శలు ఇప్పటికే ఉన్నాయి.