Telangana: గులాబీ అధినేత తాంబూలాలు ఇచ్చేశారు. ఇక పార్టీ నేతలు తన్నుకోవడమే తరువాయి. అత్యధిక శాతం సిట్టింగులకే టికెట్లు. మరి, ఆశావహులు? వాట్ నెక్ట్స్ అనేదే ఇప్పుడు ఆసక్తికరం.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం దరఖాస్తులు తీసుకుంటోంది. బీజేపీకి ఎప్పటిలానే నేతల కొరత. ఇలాంటి సమయంలో కేసీఆర్ ఇంత ముందుగా కేండిడేట్స్ను ప్రకటించి సాహసమే చేశారని చెబుతున్నారు. మళ్లీ పాతముఖాలకే ఛాన్స్ దక్కడంతో.. కొత్తవారంతా పక్క చూపులు చూడటం ఖాయం.
ఇప్పటికే కారు పార్టీ ఫుల్లీ లోడెడ్. ఇప్పుడు కారు దిగి.. స్పేస్ ఖాళీ చేసే టైమ్ వచ్చేసింది. పైలెట్ రోహిత్రెడ్డికి టికెట్ ఇస్తే.. పట్నం మహేందర్రెడ్డి ఊరుకుంటారా? ఉమ్మడి నల్గొండలో వేముల వీరేశం, గుత్తా అమిత్రెడ్డిలాంటి వాళ్ల పరిస్థితి ఏంటి? తాటికొండ రాజయ్య ఏం చేస్తారు? ముత్తిరెడ్డి ముందున్న మార్గం ఏంటి? మైనంపల్లి ఫ్యామిలీ అగ్గి రాజేస్తుందా? ఉమ్మడి ఆదిలాబాద్లో కల్లోలమేనా? ఖమ్మం జిల్లాలోనూ కిరికిరి తప్పదా? సిట్టింగులకే టికెట్లు ఇవ్వడంతో.. అసలు ఏ జిల్లాలో బీఆర్ఎస్ బిందాస్గా ఉండగలదు అనే చర్చ నడుస్తోంది. జిల్లాకో ఐదుగురు నేతలు పార్టీ మారడం ఖాయమంటున్నారు. అలాంటి ఆశావహుల ముందు మూడు మార్గాలు కనిపిస్తున్నాయి.
ఆప్షన్ 1: గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న కాంగ్రెస్లోకి జంప్ అవడం.. అక్కడ టికెట్ సంపాదించడం. అదంతా ఈజీ కాదు. ఎంతో స్ట్రాంగ్ కేండిడేట్ అయితే తప్ప.. హస్తం పార్టీ టికెట్ వచ్చే పరిస్థితి లేదు. ఫుల్ డిమాండ్ ఉందక్కడ. దరఖాస్తు చేసుకుని.. క్యూలో వేచి ఉండవలెయును. ఇప్పటికే ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కాంగ్రెస్తో టచ్లోకి వెళ్లిపోయారు.
ఆప్షన్ 2: బీజేపీ. ఇది కాస్త బెటర్ ఆప్షనే అవుతుందంటున్నారు. రాత్రికి రాత్రే గోడ దూకి వచ్చే నేతలకు టికెట్ ఇవ్వడం ఆ పార్టీకి అలవాటే. అసలు, అలాంటి వారినే నమ్ముకుని రాజకీయం చేస్తూ వస్తోంది కమలదళం. ఈసారి కాస్త బలపడినట్టు అనిపించినా.. కర్నాటక ఓటమి తర్వాత పూర్తిగా డీలా పడిపోయింది. ఇక, కవిత అరెస్ట్ కాకపోవడంతో బీఆర్ఎస్, బీజేపీ దొందుదొందేననే ముద్ర పడింది. బండి సంజయ్ పోయి కిషన్రెడ్డి రావడం మరింత మైనస్గా మారింది. రేసులో బాగా వెనక్కి వెళ్లిపోయింది. ఇప్పుడిక బీఆర్ఎస్లో టికెట్ రాని వారందరికీ.. బీజేపీ బెస్ట్ ఆప్షన్గా మారనుంది. కమలనాథులు సైతం రారమ్మంటూ కాషాయ కండువాలు పట్టుకుని.. వెయిట్ చేస్తున్నారని అంటున్నారు.
ఆప్షన్ 3: రెబెల్గా పోటీ చేయడం. గెలిస్తే.. మళ్లీ కారులో దూరేయడం. గత ఎన్నికల్లో కొందరికి బాగానే వర్కవుట్ అయిందీ స్ట్రాటజీ. కానీ, ఈసారి ఈ ఎత్తుగడ కాస్త కష్టంతో కూడుకున్న పనే. ట్రయాంగిల్ పోరులో.. నాలుగో వ్యక్తికి అంతగా స్పేష్ ఉండకపోవచ్చు. మూడు బలమైన పార్టీలను ఎదిరించి బరిలో నిలవడం అంత సులువు కాకపోవచ్చు. అందుకే, ఈసారి రెబెల్ కేండిడేట్ల సంఖ్య బాగా తగ్గొచ్చని అంటున్నారు.
ముహూర్తం చూసుకుని కేసీఆర్ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించడంతో.. టికెట్ రాని వాళ్లంతా.. ఇప్పుడు ప్లాన్ బీ, సీలను అమలు చేసే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. మరికొన్ని రోజుల్లో కారులో బాగానే గడబిడ చోటు చేసుకోవచ్చని అంటున్నారు.