Etela: హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు పెద్ద సంకటమే వచ్చిపడింది. కేసీఆర్ మీద సవాల్ చేసి మరీ, హుజురాబాద్లో నెగ్గారు. ప్రతీకారంగా వచ్చే ఎన్నికల్లో గజ్వేల్లో పోటీ చేసి గులాబీ బాస్ను ఓడిస్తానని ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించేశారు కేసీఆర్. అయితే, ఈసారి ఆయన గజ్వేల్తో పాటు కామారెడ్డిలోనూ పోటీలో దిగబోతుండటంతో.. ఈటల కన్ఫ్యూజన్లో పడేస్తోంది.
ఈటల రాజేందర్ టార్గెట్ ఏంటి? కేసీఆర్ను ఓడించి.. తనకు చేసిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడమే. మరి, ఇప్పుడు కేసీఆర్ను ఎక్కడ ఓడించాలి? గజ్వేల్లోనా? కామారెడ్డిలోనా? పెద్ద చిక్కే వచ్చిపడింది ఈటలకు అని అంటున్నారు.
గజ్వేల్ గతంలో ఈటల రాజేందర్కు అడ్డా. అక్కడ బరిలో దిగితే.. గులాబీ బాస్ను బాగానే భయపెట్టొచ్చు. అంతకష్టపడి ఓడించినా.. ఒకవేళ కేసీఆర్ కామారెడ్డిలో గెలిస్తే? కష్టమంతా వేస్ట్ అయిపోదా? ఇటు గజ్వేల్, అటు కామారెడ్డి.. రెండిట్లోనూ పోటీ చేసే సత్తా ఈటల రాజేందర్కు లేదనే చెప్పాలి. మరి, ఎట్టా?
ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. హుజురాబాద్ను వదిలి గజ్వేల్కు షిఫ్ట్ అయితే.. కౌశిక్రెడ్డికి భయపడి పారిపోయారనే ప్రచారం కూడా చేసే ఛాన్స్ ఉంటుంది. బచ్చా.. కౌశిక్కు తాను బెదిరేది ఏంటని నిరూపించాలంటే.. ఈటల తప్పనిసరిగా హుజురాబాద్ బరిలో దిగాల్సిందే. బైఎలక్షన్లో మాదిరి.. ఈసారి గెలుపు అంత ఈజీ కాకపోవచ్చు. కౌశిక్రెడ్డితో టఫ్ ఫైటే ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. గెలవాలంటే హుజురాబాద్పైనే పూర్తిగా ఫోకస్ పెట్టాల్సిన తప్పనిసరి పరిస్థితి. గజ్వేల్, హుజురాబాద్ రెండు పడవల్లో కాలు పెట్టే సాహసం చేయలేకపోవచ్చు. లేటెస్ట్గా కామారెడ్డి కూడా సీన్లోకి రావడంతో.. ఈటల రాజేందర్కు పెద్ద సంకటమే వచ్చినట్టైంది అంటున్నారు.