Kamareddy: గజ్వేల్ నాదే.. కామారెడ్డి నాదే అంటున్నారు సీఎం కేసీఆర్. రెండుచోట్ల పోటీ చేయాలని డిసైడయ్యారు. తాను ప్రకటించిన అభ్యర్థుల తొలిజాబితాలో రెండుచోట్ల తన పేరు ప్రకటించుకున్నారాయన. మరి, కామారెడ్డి నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకోవడం వెనుక ఆయన లెక్కేంటి? ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్.
తన కూతురు కవిత గెలుపు కోసమే కేసీఆర్ ఇలా స్కెచ్ వేశారా అనే చర్చ జరుగుతోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ఎంపీగా కవిత ఓడిపోయారు. సీఎం కూతురి ఓటమిపై దేశమంతా మాట్లాడుకున్నారు. ఈసారి కూడా కవిత నిజామాబాద్ బరిలోనే దిగుతారని చెబుతున్నారు. సిట్టింగ్ ఎంపీ అర్వింద్ సైతం ఆమెపై పోటీకి సై అంటున్నారు. గెలుపు ఎవరికీ అంతఈజీ కాకపోవచ్చు.
మరోసారి కవిత ఓడిపోతే? కేసీఆర్కు మామూలు అప్రతిష్ట రాదు. అలా జరగకుండా ఉండాలంటే.. కవిత గెలిచి తీరాల్సిందే. అందుకే, ఉమ్మడి నిజాబామాద్ వ్యాప్తంగా గులాబీ వేవ్ రావాలంటే.. కేసీఆర్లాంటి పెద్ద తలకాయ బరిలో దిగక తప్పనిసరి పరిస్థితి. ఆయనొస్తే.. సారొచ్చారొచ్చారంటూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆ ప్రభావం ఉంటుందని లెక్కలేస్తున్నారు. ఉద్యమ సమయంలో ఓసారి కరీంనగర్, ఇంకోసారి పాలమూరు ఎంపీగా కేసీఆర్ పోటీ చేసి గెలిచి చూపించారు. ఆయన పోటీతో అప్పటివరకూ మహబూబ్నగర్లో అంతగా బలంగా లేని టీఆర్ఎస్కు మంచి బూస్ట్ వచ్చింది. సేమ్ అదే స్ట్రాటజీ ఇప్పుడు కామారెడ్డి కేంద్రంగా నిజామాబాద్పై ప్రయోగిస్తున్నారని అంటున్నారు. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ సైతం ప్రెస్మీట్లో చెప్పడంతో.. కవిత కోసమే కేసీఆర్ కామారెడ్డికి వస్తున్నారని విశ్లేషిస్తున్నారు.
అయితే, కేసీఆర్ ఇటు గజ్వేల్, అటు కామారెడ్డి.. రెండుచోట్లా ఓడిపోతారంటూ ప్రతిపక్షాలు సవాల్ చేస్తుండటంతో.. తాజాగా ప్రకటించిన 115 మంది అభ్యర్థుల్లో కేసీఆరే హాట్ టాపిక్గా మారారు.