BRS: పాపం కమ్యూనిస్టులు. అవును, పాపం అనక తప్పట్లేదు. మునుగోడు ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీ గెలుపు కోసం ఎంత చేశారు వారు. కేసీఆర్ గురించి తెలిసికూడా.. బీజేపీ మీద పగతో.. కారును నెత్తిన పెట్టుకున్నారు. మునుగోడు బీఆర్ఎస్ గెలుపులో కామ్రేడ్ల సహకారం మరవలేనిది. అప్పటినుంచీ భ్రమల్లో ఉన్నాయి ఎర్రజెండాలు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ గులాబీ పార్టీతో ఎర్రదండు కలిసి పోటీ చేస్తుందని లెక్కలేసుకున్నారు. మిర్యాలగూడ, భద్రాచలం, పాలేరు, వైరా, కొత్తగూడెం, బెల్లంపల్లి.. ఇలా తమకు ఆయా సీట్లు కావాలంటూ లిస్టు కూడా రెడీ చేసుకున్నారు. కేసీఆర్ ఎప్పుడు చర్చలకు పిలుస్తారా? తమ డిమాండ్లు ఆయన ముందుంచుదామా? అని కాచుకుకూర్చున్నారు.
కేసీఆర్ గురించి తెలిసిందేగా. అవసరానికి వాడేసుకుని.. అవసరం తీరాక పక్కనపడేయడంలో ఆయన్ను మించినవాళ్లు తెలంగాణలోనే లేరంటారు. అలాంటి గులాబీ బాస్ మళ్లీ కామ్రేడ్లను కరివేపాకులా తీసిపారేశారు. తోకపార్టీలగానే చూశారు. చర్చలు కాదుకదా.. కనీసం ఫోన్ కాల్ కూడా లేదు. వారితో ఎలాంటి సంబంధం లేకుండానే.. ఏకంగా 115 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించేశారు కేసీఆర్.
కేసీఆర్ తీరుపై వామపక్షాలు బాగా హర్ట్ అయ్యాయి. ఆయన ఇలాంటివాడని తెలిసి కూడా.. మునుగోడులో చేతులు కలిపినందుకు ఇప్పుడు ఆకులు పట్టుకుంటున్నాయి. భవిష్యత్ కార్యచరణపై చర్చించేందుకు సీపీఐ, సీపీఎమ్లు ఎవరికి వారే మంగళవారం సమావేశం కావాలని నిర్ణయించాయి. బీఆర్ఎస్ పోతే పోయింది.. రెండు ఎర్రజెండాలైనా కలిసి పోటీ చేయాలా? లేదంటే, జాతీయ స్థాయిలో కలిసినట్టే.. కాంగ్రెస్తో దోస్తానా చేయాలా? అనే దానిపై చర్చించనున్నారు.