Sangareddy: సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.. తనకంటూ ప్రత్యేకంగా ఎలాంటి వర్క్ లేకుండా ఉన్నారు చాలాకాలంగా. కనీసం పార్టీ మీటింగులకు కూడా రావట్లేదు. అందుకే, ఆయన పార్టీ మారుతున్నారంటూ.. బీఆర్ఎస్లో చేరుతున్నారంటూ సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. ఎప్పటికప్పుడు ప్రెస్మీట్లు పెట్టి.. తాను పార్టీలోనే ఉంటానని.. రాహుల్ మనిషినంటూ చెప్పుకుంటున్నారు. అయినా, జగ్గారెడ్డిపై అనేక అనుమానపు చూపులు.
తాజాగా, చింతా ప్రభాకర్ను సంగారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించారు కేసీఆర్. ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్. చింతా ప్రభాకర్ గతంలో జగ్గారెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ ఆయనకే టికెట్ ఇచ్చారు గులాబీ బాస్. కాకపోతే.. అప్పుడు వేరు ఇప్పుడు వేరు. పరిస్థితులు బాగా మారిపోయాయని అంటున్నారు.
2018 ఎన్నికల సమయంలో చింతా ప్రభాకర్ కాస్త యాక్టివ్ గానే ఉండేవారు. ఓటమి తర్వాత బాగా డీలా పడ్డారు. శారీరకంగానూ డౌన్ అయ్యారు. పాక్షిక పక్షపాతంతో అనారోగ్యంగా ఉన్నారు. గడిచిన రెండేళ్లూ ఆయన ప్రజలకు అంతగా అందుబాటులో లేరని స్థానికుల మాట. మంత్రి హరీశ్రావుకు సన్నిహితుడు కావడంతో మరోసారి ఆయనకే టికెట్ వరించిందని తెలుస్తోంది.
అయితే, జగ్గారెడ్డిపై గెలుపే లక్ష్యమైతే.. హరీశ్రావుకు మరో ముఖ్య అనుచరుడిగా ఉన్న డాక్టర్ శ్రీహరిని బరిలో దించేవారని అంటున్నారు. శ్రీహరి అయితే జగ్గారెడ్డిపై బలమైన అభ్యర్థిగా నిలిచేవారని చెబుతున్నారు. అలాంటిది శ్రీహరిని కాకుండా.. చింతా ప్రభాకర్కే టికెట్ ఇవ్వడంపై అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. జగ్గారెడ్డి కోసమే వీక్ కేండిడేట్ను అనౌన్స్ చేశారని డౌట్ పడుతున్నారు.
జగ్గారెడ్డి కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. కారు ఎక్కాలని ఉన్నా.. ఎక్కలేకపోతున్నారు. కేటీఆర్తో మంచి సాన్నిహిత్యం ఉన్నా.. హరీశ్రావుతో తీవ్ర విభేదాలు అడ్డుపడుతున్నాయి. హరీశ్ కారణంగానే జగ్గారెడ్డి గులాబీ కండువా కప్పుకోవడం లేదని టాక్.
కాంగ్రెస్పై అలక.. బీఆర్ఎస్పై ప్రేమ వల్ల.. సంగారెడ్డిలో జగ్గారెడ్డి గెలిచినా.. కేసీఆర్కే అనుకూలం అంటున్నారు. ఆయన హస్తం పార్టీలో ఉన్నా.. రెబెల్ వాయిస్ వినిపిస్తుండటం ప్రత్యర్థి పార్టీకి అడ్వాంటేజే అంటున్నారు. ఈసారి బొటాబొటి మెజార్టీ వచ్చినా.. జగ్గారెడ్డిని గట్టిగా రారమ్మని పిలిస్తే ఆయన కేసీఆర్ గూటికి వచ్చేస్తారని అంచనా వేస్తున్నారు. అందుకే, సంగారెడ్డిలో జగ్గారెడ్డి గెలవడం.. ఏ విధంగా చూసినా బీఆర్ఎస్కే అనుకూలమని లెక్కేస్తున్నారు. ఆ లెక్క ప్రకారమే.. జగ్గారెడ్డిపై గతంలో ఓడిపోయిన చింతా ప్రభాకర్నే మళ్లీ పోటీకి నిలిపారని అంటున్నారు. ఏమో.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.