Paleru: వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల పాలేరు నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించేశారు. నియోజకవర్గంలో పార్టీ ఆఫీసు కూడా కట్టేసుకుంటున్నారు. ఈలోగా వేగంగా రాజకీయ సమీకరణాలు మారిపోతున్నారు. ఏకంటా పార్టీనే కాంగ్రెస్లో విలీనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. షర్మిలకు సైతం హస్తం హైకమాండ్ కమ్ కమ్ అంటూ వెల్కమ్ చెబుతున్నట్టు తెలుస్తోంది. ఆమె కాంగ్రెస్లో చేరినా.. పోటీ మాత్రం పాలేరు నుంచే అంటున్నారు. మరి, పాలేరులో షర్మిల ప్రత్యర్థి ఎవరు? సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డా? గతంలో తుమ్మల నాగేశ్వరరావునా? అనే సందిగ్థం ఉండేది. ఇప్పుడు బరిలో నిలిచే పందెంకోళ్లపై క్లారిటీ వచ్చేసింది.
పాలేరు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కందాల ఉపేందర్నే ప్రకటించారు కేసీఆర్. మరో సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావుకు పాలేరు టికెట్ ఆశించినా.. ఆయన్ను పూర్తిగా పక్కనపెట్టేశారు. సిట్టింగ్కే జై కొట్టారు.
ఇక, పాలేరు నుంచి షర్మిల వర్సెస్ కందాల పోరు హోరాహోరీగా జరగనుంది. వైఎస్సార్టీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తే.. ఆమె హస్తం గుర్తుపైనే బరిలో నిలవనున్నారు. తనకు టికెట్ రాలేదని తుమ్మల బీఆర్ఎస్కు హ్యాండ్ ఇస్తే..? పాలేరులో కారు గెలుపు అంత ఈజీ కాకపోవచ్చు.
ఒకవేళ.. షర్మిల పార్టీ కాంగ్రెస్లో విలీనం కాకపోయినా.. మళ్లీ ఈక్వేషన్ మారిపోతుంది. బీఆర్ఎస్, షర్మిల, కాంగ్రెస్ల మధ్య ఓట్లు చీలి.. ఎవరికి లాభం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. అదే, షర్మిల కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే మాత్రం.. కందాలకు కంగారే అంటున్నారు. తుమ్మలనే పాలేరులో గెలుపు ఓటములను ప్రభావం చేయగలరని చెబుతున్నారు.
మొత్తానికి పాలేరులో షర్మిల ప్రధాన ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. ఇక, ఆమె ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేదే తేలాల్సి ఉంది.