Jagan : చంద్రబాబు, జగన్ ఎవరు బెటరో తేల్చుకోవాలని ఏపీ సీఎం ఉద్యోగులను కోరారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ఏపీఎన్జీవో 21వ రాష్ట్ర మహాసభలకు సీఎం జగన్ హాజరయ్యారు. పెండింగ్లో ఉన్న డీఏ దసరా కానుకగా అందిస్తామని ప్రకటించారు.
2019 నుంచి ఇప్పటివరకు 3 లక్షల 19 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చామని జగన్ తెలిపారు. 53 వేల మందిని హెల్త్ సెక్టార్లో నియమించామని చెప్పారు.
ఉద్యోగుల ఇబ్బందులపై ఎప్పుడూ సానుకూలంగానే స్పందించామన్నారు. నిజాయితీగా వారి సమస్యలను పరిష్కరించామని స్పష్టం చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శగా నిలిచామన్నారు.
ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ను తీసుకొచ్చామని జగన్ అన్నారు. జీపీఎస్ పెన్షన్ స్కీమ్కు ఆర్డినెన్స్ తీసుకొస్తామని వెల్లడించారు. ఈ పెన్షన్ స్కీమ్ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. నెల మొదటి వారంలోనే జీతాలు ఇస్తూ ఉద్యోగులకు అండగా నిలుస్తున్నామన్నారు. కారుణ్య నియామాల్లోనూ పారదర్శకత పాటించామన్నారు. 10 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామని వివరించారు.
టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో అడ్డగోలుగా దోచుకున్నారని జగన్ విమర్శించారు. మొక్కుబడిగా కొన్ని ఉద్యోగాలు ఇచ్చారని మండిపడ్డారు.ఉద్యోగుల గురించి బాబుకు దారుణమైన అభిప్రాయాలున్నాయని ఆరోపించారు. వారిని ఆయన ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు. బాబు మంచి చేయగలడా అని ఉద్యోగులు ఆలోచించాలని జగన్ సూచించారు. ప్రభుత్వ వ్యవస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఆయన పాలనలో 54 ప్రభుత్వ రంగ సంస్థలను మూసేశారని వెల్లడించారు.