Mynampally : మంత్రి హరీష్ రావుపై.. మల్కాజిగిరి ఎమ్మెల్యే హనుమంతరావు తీవ్రవ్యాఖ్యలు చేశారు. హరీశ్ తన నియోజకవర్గం వదిలి జిల్లా గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. సిద్ధిపేటలో హరీశ్ రావు అడ్రస్ గల్లంతు చేస్తానని హెచ్చరించారు.
తాను మల్కాజ్ గిరి నుంచి, తన కుమారుడు మెదక్ నుంచి పోటీ చేస్తామని మైనంపల్లి హనుమంతరావు స్పష్టం చేశారు. రాజకీయంగా హరీశ్.. ఎంతోమందిని అణచివేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కుటుంబంలో అంతమందికి టికెట్లు ఇచ్చినప్పుడు.. తనకు, తన కుమారుడికి ఎందుకు టికెట్లు ఇవ్వరని మైనంపల్లి ప్రశ్నించారు.
తన కుమారుడిని ఎమ్మెల్యే చేయడమే లక్ష్యమని మైనంపల్లి స్పష్టం చేశారు. మెదక్, మల్కాజ్గిరి టికెట్లు ఇస్తేనే బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తామన్నారు. ఇద్దరికీ టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా సమయంలో తన కుమారుడు ఎంతో ప్రజాసేవ చేశాడని గుర్తు చేశారు. ప్రజలను ఆదుకునేందుకు రూ.8 కోట్ల సొంత డబ్బు ఖర్చు చేశారని మైనంపల్లి తెలిపారు.