BRS : బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ వేళ ప్రగతి భవన్ లో సందడి నెలకొంది. అభ్యర్థులు ఎంపికపై కసరత్తును కేసీఆర్ పూర్తి చేశారు. కేసీఆర్ తో హారీష్ రావు భేటీ అయ్యారు. అక్కడ ఎమ్మెల్సీ కవిత, మధుసూదనాచారి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఉన్నారు. ముత్తిరెడ్డికి కేసీఆర్ స్వయంగా నచ్చచెప్పారు.
అంతకుముందు ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర కోలాహలం ఏర్పడింది. పలువురు మంత్రులు, బీఆర్ఎస్ నేతలు, టికెట్ ఆశించిన ఆశావాహులు కవితతో సమావేశమయ్యారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రేఖా నాయక్, సంజయ్, ఎమ్మెల్సీ రమణ, మాజీ ఎమ్మెల్యేలు చంద్రావతి, సునీతా లక్ష్మారెడ్డి.. కవితతో భేటీ అయ్యారు.
మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. మంత్రి హరీశ్ రావు కూడా సీఎం కేసీఆర్ తో ప్రగతి భవన్ లోనే ఉండటంతో ఆసమయంలో ఆశావాహులు ఎమ్మెల్సీ కవిత ఇంటికి క్యూ కట్టారు.
కేసీఆర్ అభ్యర్థుల జాబితాను ఏ క్షణంలోనైనా విడుదల చేసే అవకాశం ఉంది. శ్రావణ పంచమి తిథి కావడంతో అభ్యర్థుల ప్రకటనకు ఇదే శుభముహూర్తంగా గులాబీ బాస్ నిర్ణయించారని తెలుస్తోంది. కేసీఆర్ లక్కీ నెంబర్ ఆరు. అందుకే తొలి జాబితాలో 105 మంది అభ్యర్థులను ప్రకటిస్తారని టైమ్, అభ్యర్థుల సంఖ్య టోటల్ 6 ఉండేలా ప్లాన్ చేశారని తెలుస్తోంది.