INDIA : వచ్చే ఎన్నికల కోసం “I.N.D.I.A” కూటమిగా ఏర్పడిన ప్రతిపక్షాలు… లోగో విడుదల చేయబోతున్నాయి. కూటమి వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం… ముంబై జరగబోయే సమావేశంలో లోగో ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్ ఒకటో తేదీల్లో ముంబైలో విపక్ష కూటమి సమావేశం జరగనుంది. పాట్నాలో మొదటి సమావేశం జరగగా.. రెండో సమావేశం బెంగళూరులో జరిగింది.
ముంబైలో జరిగే ఇండియా కూటమి మూడో సమావేశానికి ఉద్ధవ్ థాక్రే ఆతిథ్యం ఇవ్వనున్నారు. పాట్నాలో జరిగిన కూటమి సమావేశానికి సుమారు 17 పార్టీలకు చెందిన 32 మంది హాజరయ్యారు. బెంగళూరు సమావేశంలో 26 కూటమి పార్టీలు పాల్గొన్నాయి. ముంబైలో జరిగే మూడో కూటమి సమావేశంలో 26 కంటే ఎక్కువ రాజకీయ పార్టీలకు చెందిన సుమారు 80 మంది నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. ముంబై సమావేశంలో మరికొన్ని పార్టీలు కూటమిలో చేరబోతున్నాయని సమాచారం.
కూటమి రెండో సమావేశం అనంతరం NCPలో చీలిక సహా దేశవ్యాప్తంగా అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల ఐక్యతకు పరీక్ష పెట్టేలా ఢిల్లీ ఆర్డినెన్స్ ఓటింగ్, అవిశ్వాస తీర్మానంపై చర్చలు జరిగాయి. ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీసేందుకు జరుగుతున్న ప్రయత్నాల నేపథ్యంలో ఇండియా కూటమి జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఐటీ, ఈడీ, సీబీఐ కేసులతో విపక్ష నేతలను బెదిరిస్తూ ఒత్తిళ్లకు గురి చేస్తున్నారంటూ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తమ ఐక్యతను దెబ్బతీయలేవని… ఇంకా చెప్పాలంటే మరింత బలోపేతం చేస్తాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముంబైలో ఇండియా కూటమి లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో ఏం సందేశం ఇస్తారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.