BRS First List : వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధమైంది. పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు పేర్లు ప్రకటిస్తారని తెలుస్తోంది. పంచమి తిథి కావడంతో అభ్యర్థుల ప్రకటనకు ఇదే శుభముహూర్తంగా నిర్ణయించారని ప్రచారం జరుగుతోంది.
రెండో విడత జాబితా ఈ నెల 25న విడుదలయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాల నుంచి సమాచారం. ఎన్నికలు డిసెంబర్ లో జరిగే అవకాశం ఉంది. గత ఎన్నికల కంటే కనీసం మూడు నెలల ముందుగానే అభ్యర్థుల పేర్లు ప్రకటించాలని గులాబీ బాస్ నిర్ణయించుకున్నారు. ముందుగా అభ్యర్థులను ప్రకటిస్తే ప్రచారానికి తగినంత సమయం లభిస్తుందని భావిస్తున్నారు. ప్రతిపక్షాలను ఆత్మరక్షణలో పడేయడానికి అవసరమైన వ్యూహాలను అమలు చేయొచ్చని గులాబీ అధినేత ప్లాన్.
ఆదివారం సూర్యాపేట జిల్లా పర్యటనకు ముందు మంత్రులు హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి తదితర కీలక నేతలతో భేటీ అయ్యారు సీఎం కేసీఆర్. అక్కడి నుంచి తిరిగి వచ్చాక మళ్లీ రాత్రి వరకు అభ్యర్థుల ఎంపికపై కొందరు మంత్రులతో చర్చించారని సమాచారం. మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా టికెట్ల విషయమై సీఎంను కలిసినట్లు తెలుస్తోంది. కసరత్తు కొలిక్కి వచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ తొలి జాబితా విడుదల చేస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
2018 ఎన్నికల సమయంలో ఒకేసారి 105 మందితో మొదటి జాబితాను ప్రకటించింది గులాబీ పార్టీ. ఈ దఫా 87 మందితో తొలి జాబితా ఉంటుందని ప్రచారం జరిగినా.. ఇంకా ఎక్కువ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఎంతమందికి టికెట్లు దక్కే అవకాశముందే అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
పలు దఫాలుగా సర్వేలు, సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల బలాలు, బలహీనతలు, ప్రత్యర్థుల బలాలు.. ఇలా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని ఖరారు చేసిన పేర్లను వీలైనంత ముందుగా ప్రకటించాలన్నది గులాబీ పార్టీ వ్యూహం. టికెట్లు ఖరారైతే.. ఆశావహులు టికెట్ల కోసం పోటీపడటం మానేసి ఎన్నికల ప్రచారంపై దృష్టిసారిస్తారని ఎక్కడైనా సమస్యలున్నా సర్దిచెప్పడానికి సమయం ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం భావిస్తోందని తెలుస్తోంది.
అత్యధిక స్థానాల్లో సిట్టింగులకే మరోసారి అవకాశం కల్పించాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారని సమాచారం. తప్పనిసరి పరిస్థితుల్లోనే అభ్యర్థిని మార్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అసంతృప్తులను బుజ్జగించడంపై మంత్రులతో సీఎం కేసీఆర్ చర్చించారని సమాచారం. సిట్టింగులను తప్పనిసరిగా మార్చాల్సిన పరిస్థితుల్లో.. వారికి భవిష్యత్తులో తగిన అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇస్తున్నట్లు తెలుస్తోంది.
కొన్ని నియోజకవర్గాల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, అసమ్మతి ఉండటంతో వారిని మార్చే అవకాశాలున్నాయి. దీంతో ఆయా స్థానాలను ఆశిస్తున్న వారు టికెట్ కోసం ఆఖరి నిమిషం వరకూ ప్రయత్నిస్తున్నారు. కొందరు ఆశావహులు ఆదివారం సీఎం కేసీఆర్, హరీశ్రావులతో సమావేశమయ్యారు.