India Vs Ireland : ఐర్లాండ్ తో జరిగిన రెండో టీ20లోనూ టీమిండియా విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. డబ్లిన్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.
ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (58, 43 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సు), సంజు శాంసన్ ( 40, 26 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సు), రింకూ సింగ్ ( 38, 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులు), శివమ్ దూబె ( 22 నాటౌట్, 16 బంతుల్లో 2 సిక్సులు) రాణించడంతో టీమిండియా భారీ లక్ష్యాన్ని ఐర్లాండ్ ముందు ఉంచింది. ఐర్లాండ్ బౌలర్లలో బారీ మెకార్తీ రెండు వికెట్లు, మార్క్ అడైర్, క్రెయిగ్ యంగ్, బెన్ వైట్ తలో వికెట్ తీశారు.
186 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ ఆదిలోనే తడబడింది. కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ (0), టక్కర్ (0)ను ఒకే ఓవర్ లో ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ ఆండీ బాల్ బిర్నీ ( 72, 51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులు) ఒంటరి పోరాటం చేశాడు. కాంఫర్ (18), డాక్ రెల్ (13), మార్క్ అడైర్ ( 23) తో కలిసి స్కోర్ పెంచే ప్రయత్నం చేశాడు. దీంతో ఐర్లాండ్ విజయం కోసం కాస్త పోరాడింది. అయినాసరే 20 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేసింది. దీంతో టీమిండియా 33 పరుగుల తేడాతో గెలిచింది. భారత్ బౌలర్లలో కెప్టెన్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్టోయ్ రెండేసి వికెట్లు, అర్ష్ దీప్ సింగ్ ఒక వికెట్ తీశారు. రింకూ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
తొలి టీ20కి వర్షం ఆటంకం కలిగించడంతో భారత్ డక్ వర్త్ లూయిస్ మెథడ్ ప్రకారం 2పరుగుల తేడాతో గెలిచింది. తొలి రెండు మ్యాచ్ లు గెలవడంతో సిరీస్ భారత్ సొంతమైంది. మూడో టీ20 డబ్లిన్ వేదికగానే ఆగస్టు 23న జరుగుతుంది.