Tpcc Leaders : తెలంగాణ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఇప్పటికే చేరికల జోరు పెరిగింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజాకోర్టు ద్వారా ప్రచారాస్త్రాలను సిద్ధం చేసుకుంది.
ఇక మరిన్ని యాక్షన్ ప్లాన్స్ రెడీ చేసేందుకు కాంగ్రెస్ జాతీయ నాయకత్వం దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే టీపీసీసీ కీలక నేతలు ఢిల్లీకి వెళ్లారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో టీపీసీసీ నేతలు భేటీ అయ్యారు. సీఎల్పీ నేత భట్టివిక్రమార్కతోపాటు సీనియర్ నేతలు సమావేశంలో పాల్గొన్నారు. ఖర్గేతో సమావేశంలో టీపీసీసీ నేతలు చేవెళ్ల సభ, పార్టీ బలోపేతం, చేరికలు, డిక్లరేషన్లపై చర్చిస్తున్నారు. చేవెళ్ల సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ విడుదల చేసేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 29న వరంగల్లో మైనార్టీ డిక్లరేషన్ ప్రకటిస్తారని తెలుస్తోంది.
మహిళా డిక్లరేషన్ విడుదలకు కూడా కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. మహిళా డిక్లరేషన్ విడుదల చేసే సభకు.. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని ఆహ్వానించాలని భావిస్తోంది. ఇలా కాంగ్రెస్ బహుముఖ వ్యూహంతో అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది.
ఒకవైపు ఇతర పార్టీలను నేతలకు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీని బలోపేతం చేసే చర్యలు కొనసాగిస్తోంది. మరోవైపు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే పథకాలను ప్రకటిస్తోంది. గతేడాదే వరంగల్ సభలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించారు. కొంతకాలం క్రితం హైదరాబాద్ లో ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. కాంగ్రెస్ హామీలు అధికార బీఆర్ఎస్ పార్టీలో గుబులు రేపుతున్నాయి.