Haripriya Nayak : బీఆర్ఎస్ లో టిక్కెట్ కోసం నేతల మధ్య వివాదాలు రేగుతున్నాయి. చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా ఇల్లందు నియోజకవర్గ టిక్కెట్ పంచాయితీ హైదరాబాద్ కు చేరింది. అక్కడ అధికార పార్టీలో రేగిన అసమ్మతి మంటలు చల్లారేలా కనిపించడం లేదు.
ఇల్లందు టిక్కెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కు ఇవ్వొద్దంటూ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు వర్గం పావులు కదువుతోంది. ఈ నేపథ్యంలో హరిప్రియ నాయక్ తన అనుచరులతో కలిసి హైదరాబాద్ వచ్చారు. సీఎం కేసీఆర్ కలవాలని ప్రయత్నించారు. కానీ అపాయింట్ మెంట్ దొరకలేదు. దీంతో మంత్రి హరీశ్ రావుతో ఆమె భేటీ అయ్యారు. తన టిక్కెట్ విషయంపై చర్చించారు. ఆ తర్వాత హరిప్రియ నాయక్ హైదరాబాద్ నుంచి ఇల్లందుకు వెళ్లిపోయారు.
అంతకుముందు హరిప్రియ నాయక్ కు వ్యతిరేకంగా ఇల్లందు మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ఇంట్లో అసమ్మతి నాయకులు సమావేశం అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మాధవరావు, ఇల్లందు ఎంపీపీ భర్త జానీ పాషా, ఇల్లందు PACS ఛైర్మన్ మెట్ల కృష్ణ, బయ్యారం PACS ఛైర్మన్ మధుకర్ రెడ్డి, మహబూబాబాద్ జడ్పీ ఛైర్మన్ ఆంగోత్ బిందు తండ్రి శ్రీకాంత్, గార్ల మాజీ ఎంపీపీ వెంకట్లాల్తోపాటు మరో 20 మంది నేతలు మంతనాలు జరిపారు.
హరిప్రియ నాయక్ వైఖరితో పార్టీకి కార్యకర్తలు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని అసమ్మతి నేతలు ఆరోపించారు. ఆమె మరోసారి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు లేవని అంటున్నారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. మరి హరిప్రియ నాయక్ కు టిక్కెట్ దక్కుతుందా? అసమ్మతి నేతల ఒత్తిడికి బీఆర్ఎస్ అధిష్టానం తలొగ్గుతుందా?