Yarlagadda Venkatrao : ఉమ్మడి కృష్టా జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీకి షాకిచ్చి టీడీపీలో చేరేందుకు సిద్ధమైన యార్లగడ్డ వెంకట్రావు.. టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. టీడీపీలో చేరిక విషయంపై చర్చించారు. తాను పార్టీలోకి వస్తానని యార్లగడ్డ తెలిపారు. ఈ నెల 22న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో యార్లగడ్డ పసుపు కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.
చంద్రబాబుతో భేటీ తర్వాత యార్లగడ్డ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో ఉండగా తాను ఎప్పుడూ పదవులు అడుక్కోలేదని స్పష్టం చేశారు. ఆ పార్టీలో తన వర్గం నేతలకు ఎలాంటి పదవులు దక్కలేదన్నారు. వైసీపీలో తాను ఎదుర్కొన్న పరిస్థితులతో మూడేళ్లు నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పారు. టీడీపీతో కలిసి పని చేస్తానని యార్లగడ్డ స్పష్టం చేశారు. చంద్రబాబు ఆదేశాలను పాటిస్తానన్నారు. ఎక్కడ నుంచైనా పోటీ చేస్తానని తెలిపారు. గుడివాడ నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నానని తేల్చిచెప్పారు.
గత ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం నుంచి వైసీపీ తరఫున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికల తర్వాత వల్లభనేని టీడీపీకి గుడ్ బై చెప్పారు. వైసీపీ చెంతన చేరిపోయారు. దీంతో యార్లగడ్డకు వైసీపీలో ప్రాధాన్యత తగ్గింది. 2024 ఎన్నికల్లోనూ వంశీకే టిక్కెట్ ఇస్తామనే సంకేతాలను వైసీపీ అధిష్టానం బలంగా పంపింది.
మరోసారి గన్నవరం నుంచి పోటీ చేయాలని భావించిన యార్లగడ్డ తాజా పరిస్థితుల నేపథ్యంలో తనకు టిక్కెట్ దక్కదనే నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో వైసీపీకి గుడ్ బై చెప్పారు. టీడీపీలో చేరందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గన్నవరం, విజయవాడలో తన అనుచరులతో ఆత్మీయ భేటీలు నిర్వహించారు. ఇప్పుడు గుడివాడ నుంచి పోటీ చేస్తానని ప్రకటించి కొత్త ట్విస్ట్ ఇచ్చారు. గుడివాడలో వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కొడాలి నాని పోటీ చేస్తారు. ఒకవేళ యార్లగడ్డ టీడీపీ తరఫున అక్కడ నుంచే బరిలోకి దిగితే పోటీ రసవత్తరకంగా మారే అవకాశం ఉంది.