Deaths: దేశంలో పోస్ట్ కొవిడ్ మరణాలు భారీగా నమోదవుతున్నాయి. వయస్సుతో నిమిత్తం లేకుండా ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. వీటిల్లో కార్డియాక్ ఎటాక్ తో చనిపోతున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. ముఖ్యంగా 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్నవారి మరణాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
పెరిగిపోతున్న ఆకస్మిక మరణాలపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ దృష్టిపెట్టింది. అపెక్స్ మెడికల్ రీసెర్చ్ బాడీతో కలిసి కొవిడ్ అనంతరం యువకుల “ఆకస్మిక మరణాల”పై పరిశోధనలకు శ్రీకారం చుట్టింది. ఉన్నట్టుండి మరణిస్తున్న వారిపై అధ్యయనాలు ప్రారంభించింది.
ICMR డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్.. 18 నుండి 45 సంవత్సరాల వయస్సు గల మరణాలను పరిశీలిస్తున్నట్లు ప్రకటించారు. గుజరాత్ గాంధీనగర్లో జరిగిన గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సమ్మిట్ లో పాల్గొన్న ఆయన.. ఎలాంటి కారణాలు లేకుండా సంభవిస్తున్న ఆకస్మిక మరణాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. గుండెపోటు, ఊపిరితిత్తులు దెబ్బతినడంతో ఆకస్మిక మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తించారు.
కొవిడ్ తర్వాత యువత ఆకస్మిక మరణాలలోకు కారణమవుతున్న.. శారీరక మార్పులపై ICMR అధ్యయనం చేస్తోంది. ఇందుకోసం ICMR గత సంవత్సరంలో 18 నుంచి 45 ఏళ్ల వయస్సులో ఆకస్మికంగా మృతి చెందిన వారి డేటాను ఉపయోగించుకుంటోంది.
దేశంలోని 40 కేంద్రాల నుంచి డేటాను తెప్పించుకున్న ICMR.. చనిపోయినవారి కొవిడ్ అడ్మిషన్లు, హాస్పిటల్ డిశ్చార్జ్, వారి ఆరోగ్య సమస్యలను అధ్యయనం చేయనుంది. ఆయా వ్యక్తుల ఆహారపు అలవాట్లు, పొగాకు వినియోగం, జీవనశైలి, కోవిడ్ చరిత్ర, టీకా, ఫ్యామిలీ హెల్త్ హిస్టరీని కూడా అధ్యయనం చేస్తోంది.