Pilot Rohit Reddy : పైలట్ రోహిత్ రెడ్డి.. ఇప్పుడు ఈ పేరు తెలంగాణలో హాట్ టాపిక్. కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ లో చేరినప్పుడు రోహిత్ రెడ్డి పేరు ఇంత ప్రాచుర్యంలోకి రాలేదు. కానీ మొయినాబాద్ లోని తన ఫామ్ హౌస్ లో జరిగిన ఎమ్మెల్యేల ఎర వ్యవహారంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక్కసారిగా హీరోగా మారిపోయారు. 2018 ఎన్నికల్లో రోహిత్ రెడ్డి తాండూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో అప్పటి మంత్రి పట్నం మహేందర్ రెడ్డిని ఓడించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ తో పైలట్ రోహిత్ రెడ్డి కారెక్కారు. ఎమ్మెల్యేగా ఓడినా మహేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు సీఎం కేసీఆర్. 2018 ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడిన మహేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డి ఇప్పుడు గులాబీ గూటిలో ఉన్నారు. ఈ ఇద్దరు నేతల మధ్య సయోధ్య లేదన్నది బహిరంగ రహస్యమే.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ట్రాప్ వ్యవహారంలో బీజేపీని ఇరుకున పెట్టడంలో పైలట్ రోహిత్ రెడ్డే కీలక పాత్ర పోషించారు. మధ్యవర్తులుగా వచ్చిన వ్యక్తులను తన ఫామ్ హౌస్ కేంద్రంగానే ఇరికించారు. ఈ ఎపిసోడ్ తో కేసీఆర్ దగ్గర మంచి మార్కులు కొట్టేశారు రోహిత్ రెడ్డి. తాజా ఎపిసోడ్ తో ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉన్న పట్నం మహేందర్ రెడ్డికి పరోక్షంగా చెక్ పెట్టారని అంటున్నారు.
కేసీఆర్ దగ్గర మంచి మార్కులు కొట్టేయడంతో.. వచ్చే ఎన్నికల్లో తాండూరు టికెట్ రోహిత్ రెడ్డికే వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. దాదాపు ఆయనకే కన్ఫామ్ అనే ప్రచారం మొదలైపోయింది. అదే జరిగితే.. రోహిత్ కు బద్ద శత్రువైన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పరిస్థితేంటి? తాండూరు నియోజవర్గంలో బలమైన నేతగా ఉన్న మహేందర్ రెడ్డి టికెట్ ను అంత ఈజీగా వదులుకుంటారా? ఎమ్మెల్సీగా సంతృప్తిపడే రకం కాదాయన. ఒకవేళ టీఆర్ఎస్ అభ్యర్థిగా అవకాశం రాకపోతే ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది.
పట్నం మహేందర్ రెడ్డి ముందు రెండు ఆప్షన్లు ఉంటాయి. టికెట్ రాకున్నా కామ్ గా ఉండి పార్టీలో కొనసాగడం. కేసీఆర్ ఇస్తే మరోసారి ఎమ్మెల్యే కావడం. లేదంటే, టికెటే రాదంటే.. టీఆర్ఎస్ ను వీడే అవకాశాలు ఎక్కువే అంటున్నారు. ఆయన వస్తానంటే ఏ పార్టీ అయినా రెడ్ కార్పెట్ పరుస్తుంది. తమను దెబ్బతీసిన రోహిత్ రెడ్డికి చెక్ పెట్టేందుకు.. బీజేపీ నేతలు పట్నం మహేందర్ రెడ్డిపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించి అక్కున చేర్చుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అదే జరిగితే, బలమైన సీనియర్ లీడర్ పట్నం పార్టీని వీడితే.. గులాబీ వర్గానికి బిగ్ మైనస్. పైలెట్ తో గులాబీ దళానికి ఎంత కలిసొచ్చిందో తెలీదు కానీ.. పట్నం కారు దిగితే మాత్రం మూడు జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి చాలా డ్యామేజ్ అవుతుందని అంటున్నారు.