Kidney: ప్రపంచ వ్యాప్తంగా ఏటా కిడ్నీ సమస్యలతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కిడ్నీ జబ్బుల బారిన పడిన చాలా మందికి మూత్రపిండాల మార్పిడి ఒక్కటే పరిష్కారం. అయితే కిడ్నీ డోనర్ల లభ్యత అనేది చాలా తక్కువ. ఈ సమస్యకు పందుల కిడ్నీలతో పరిష్కారం చూపే దిశగా పరిశోధకులు కీలక ముందడుగు వేశారు.
అవును… కిడ్నీ మార్పిడి చరిత్రలో పెద్ద ముందడుగు పడింది. బ్రెయిన్ డెడ్ అయిన రోగికి పంది కిడ్నీ అమర్చారు వైద్యులు. అది నెలరోజుల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేసింది. అయితే, మనిషికి అమర్చిన పంది కిడ్నీ ఇన్నిరోజులు పనిచేయడం ఇదే తొలిసారి అని వైద్యులు చెప్పారు. అమెరికాలోని న్యూయార్క్లో ఎన్వైయూ లాంగోన్ హెల్త్ సంస్థ వైద్యులు ఓ బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తికి గత జులై 14న పంది కిడ్నీని అమర్చారు. అయితే ఆ కిడ్నీ ఏ విధంగా పనిచేస్తుందనే విషయాన్ని వైద్యులు తెలుసుకొనే ప్రయత్నం చేశారు. వారు ఊహించిన దానికంటే బ్రెయిన్ డెడ్ అయిన మనిషిలో పంది కిడ్నీ చక్కగా పనిచేస్తోంది. 32 రోజులు అయినప్పటికీ అదిపనిచేసే ప్రక్రియలో ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని వైద్యులు గుర్తించారు.
ఎన్వైయూ లాంగోన్ ట్రాన్స్ప్లాంట్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ రాబర్ట్ మోంట్గోమోరీ దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేశారు. బ్రెయిన్ డెడ్ అయిన రోగి శరీరంలో పంది మూత్ర పిండాన్ని అమర్చినట్లు తెలిపారు. నెలరోజుల తరువాత ఆ మూత్రపిండం ఎలా పనిచేస్తుందో పరిశీలించామన్నారు. రోగికి అమర్చిన అవయవాన్ని తిరస్కరించే సంకేతాలు మాకు కనిపించలేదని తెలిపారు. అయితే, గతంలో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదన్నారాయన. మనిషి వ్యాధి నిరోధకతకు పంది కిడ్నీ ఎలా పనిచేస్తుందో కూడా చూస్తామని ప్రకటించారు. అందుకోసం మరో రెండు నెలలు కూడా కిడ్నీని అలాగే ఉంచి చూడనున్నట్లు తెలిపారు. అన్నీ కుదిరితే త్వరలో సాధారణ రోగులకు కూడా పంది కిడ్నీ అమర్చే ప్రక్రియను ప్రారంభిస్తామని వైద్యులు చెబుతున్నారు.
గతంలోనూ ఇలాంటి ప్రయోగం జరిగింది. కానీ, న్యూయార్క్ వర్సిటీ, అలబామా వర్సిటీ చేసిన కిడ్నీ మార్పిడులు రెండు మూడు రోజుల పాటు మాత్రమే పనిచేశాయి. గత ఏడాది కూడా మేరి ల్యాండ్ యూనివర్సిటీ పరిశోధకులు పంది నుంచి సేకరించిన గుండెను మనిషికి అమర్చారు. కానీ ఆ వ్యక్తి రెండు నెలలు మాత్రమే బతికాడు.
మనిషికి జంతువుల అవయవాలను అమర్చడాన్ని వైద్య పరిభాషలో జెనోట్రాన్స్ప్లాంట్ గా వ్యవహరిస్తారు. జంతువుల నుంచి సేకరించిన కిడ్నీలను మనుషులకు ట్రాన్స్ప్లాంట్ చేసే దిశగా పరిశోధనలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. 1963-64లో 13 మందికి చింపాజీల కిడ్నీలను అమర్చారు. అలా ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న ఒకరిలో చింపాజీ కిడ్నీ 9 నెలలపాటు పని చేసింది. కానీ ఆ పేషెంట్ అకస్మాత్తుగా చనిపోయారు. 1964లో మనిషికి చింపాజీ గుండెను ట్రాన్స్ప్లాంట్ చేశారు. కానీ ఆపరేషన్ చేసిన రెండు గంటల్లోనే ఆ వ్యక్తి చనిపోయారు. ఇతర జంతువుల నుంచి సేకరించి అమర్చిన అవయవాలపై మానవ రోగ నిరోధక వ్యవస్థ దాడి చేయడమే దీనికి కారణం. కానీ పందుల అవయవాల్లోని కణాలు.. మావన రోగ నిరోధక వ్యవస్థ దాడి నుంచి తట్టుకునేలా వాటి జన్యువుల్లో అనేక మార్పులు చేశారు. జన్యుమార్పిడి చేసిన పందులను క్లోనింగ్ ద్వారా సృష్టించడం.. తద్వారా కొరత లేకుండా.. అవయవాలను సరఫరా చేసే దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి.