Congress: ఈ నెల 26న చేవెళ్ల ప్రజాగర్జన సభ నిర్వహించాలని కాంగ్రెస్ కీలక సమావేశంలో నిర్ణయించారు. సభకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ బహిరంగ సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ఖర్గే విడుదల చేయనున్నారు.
ఖమ్మం సభలాగే చేవెళ్ల సభను విజయవంతం చేసేలా కృషి చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. తిరగబడదాం.. తరిమికొడదాం కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. సోమవారం నుంచి ఈనెల 25 వరకు శాసనసభ నియోజకవర్గాల వారీగా క్షేత్ర స్థాయిలో సమావేశాలు ఉంటాయని చెప్పారు.
ప్రతీ గడపకు చేరాలి.. ప్రతీ తలుపు తట్టేలా చూడాలని రేవంత్ సూచించారు. ఇందుకోసం పార్లమెంట్ వారీగా కోఆర్డినెటర్లను నియమించామన్నారు. 29న మైనారిటీ డిక్లరేషన్ను వరంగల్లో విడుదల చేసే అవకాశం ఉందన్నారు.
ఓబీసీ, మహిళా డిక్లరేషన్ల కోసం సబ్ కమిటీని నియమిస్తామన్నారు. మహిళా డిక్లరేషన్ సభకు ప్రియాంక గాంధీని.. మేనిఫెస్టో విడుదలకు సోనియాగాంధీని ఆహ్వానిస్తామని రేవంత్రెడ్డి తెలిపారు. ఈ నెల రోజులు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. ఆ తర్వాత కాంగ్రెస్ ఏం చేయబోతుందో ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు పీసీసీ చీఫ్.