Survey: జాతీయ పోషకాహార సంస్థ.. ఐటీ రంగంలో ఉద్యోగుల ఆరోగ్యంపై ఆందోళనను వ్యక్తం చేసింది. ఒత్తిడితో కూడిన పనివిధానం, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, గంటలకొద్దీ కూర్చొని పనిచేయడంతో అనేక రోగాల బారిన పడుతున్నారని హెచ్చరించింది. హైదరాబాద్ లోని ఐటీ సంస్థల్లో పని చేస్తున్న 183 మంది ఐటీ ఉద్యోగులపై అధ్యయనం చేసిన సంస్థ.. 46 శాతం మంది జీవనశైలి వ్యాధులబారిన పడే ప్రమాదంలో ఉన్నారని తేల్చింది.
ఐటీ రంగంలో పని చేస్తున్న ప్రతి 10 మందిలో ముగ్గురు రక్తపోటు, ఊబకాయం, మధుమేహం వంటి వ్యాధులబారిన పడుతున్నారని అధ్యయనంలో తేలింది. 35 ఏళ్ల లోపున్నవారు కూడా ఊబకాయం, రక్తపోటు, మధుమేహం బారినపడే ప్రమాదంలో ఉన్నారు. 30 సంవత్సరాల వయస్సు పైబడిన ఉద్యోగుల్లో ఆరోగ్య సమస్యలు మరింతగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది.
సగటున 8 గంటల కంటే ఎక్కువ సమయం కూర్చుని పని చేయడం, తరచూ బయట తినడం, రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు తక్కువగా తీసుకోవడం, భోజనంలో సమయపాలన పాటించకపోవడం వంటి కారణాలతో ఐటీ ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది.
ఐటీ కంపెనీల్లో ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు అవసరమని జాతీయ పోషకాహార సంస్థ స్పష్టం చేసింది. మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం, తగిన విశ్రాంతి పద్ధతులను అలవర్చడానికి ఈ కేంద్రాలు పని చేయాలంది.