తెలంగాణ వాతావరణం చల్లచల్లగా హాయిహాయిగా మారింది. శుక్రవారం నుంచి వానలు కురుస్తున్నాయి. శనివారం, ఆదివారం భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత కూడా ఓ మోస్తారు వానలు పడతాయట.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనమే ప్రస్తుత వర్షాలకు కారణం. రాబోయే మూడు రోజులు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లిలో అత్యధికంగా 10.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భూపాలపల్లి జిల్లా చేల్పూర్లో 7.95, ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో 7.6, భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లో 5.76 సెం.మీ. వర్షం పడింది. ములుగు జిల్లా కన్నాయిగూడెంలో 5.6, ఏటూరునాగారంలో 5.1, వెంకటాపురంలో 5 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
మంచిర్యాల, కుమురంభీమ్-ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో మోస్తరు వానలు పడ్డాయి. హైదరాబాద్తో పాటు శివార్లలోనూ తేలికపాటి జల్లులు కురిశాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదతో స్వర్ణ ప్రాజెక్టు 2 గేట్లు తెరిచారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టు ఒక గేటు నుంచి నీటిని వదులుతున్నారు.