జనగామలో టికెట్ పంచాయితీ ముదురుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డికి మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు భగ్గుమన్నాయి. ఇప్పటికే తనకు టికెట్ కన్ఫర్మ్ అయిందని పల్లా చెబుతున్నారు. ఇద్దరు నేతలకు సంబంధించిన ఆడియో రికార్డులు బయటకు వచ్చాయి.
మరోసారి పల్లా రాజేశ్వర్రెడ్డి తీరుపై ముత్తిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. జనగామలో అనుచరులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన ముత్తిరెడ్డి.. పల్లా తీరును తప్పుబట్టారు. సీఎం కేసీఆర్ క్లారిటీ ఇవ్వకముందే టికెట్ కన్ఫర్మ్ అయిందని ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు. ఉద్యమ సమయం నుంచి బీఆర్ఎస్లో పని చేశానని, తెలంగాణ వచ్చిన తర్వాత జనగామను సస్యశ్యామలం చేశానని తెలిపారు. జరుగుతున్న పరిణామాలు తల్చుకుంటూ ముత్తిరెడ్డి ఉద్వేగంగా మాట్లాడారు.
జనగామలో డబ్బులు పంచి తనను ఓడించేందుకు ప్రయత్నం చేశారని ముత్తిరెడ్డి తెలిపారు. ఓడించడం వీలుకాకపోవడంతో.. తన కుటుంబంలో చిచ్చు పెట్టింది పల్లానేనని అన్నారు. తన కూతురు, అల్లుడిని తనపైనే ఎదురు తిరిగేలా పల్లా రాజేశ్వర్రెడ్డి చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు పల్లా రాజేశ్వర్ రెడ్డి గురించి మొత్తం తెలుసని ముత్తిరెడ్డి అన్నారు. మొదటి విడతలోనే జనగామ టికెట్పై క్లారిటీ ఇవ్వాలని కోరారు.
అంతకుముందు.. ముత్తిరెడ్డి వర్గీయులు జనగామలో భారీ ర్యాలీ నిర్వహించారు. పల్లా వద్దు, ముత్తిరెడ్డి ముద్దు.. గోబ్యాక్ పల్లా.. అంటూ ఆయన వర్గం బలప్రదర్శన చేసింది.