భారత్ జోడో యాత్రతో దేశమంతా కాలినడకన తిరిగేశారు రాహుల్గాంధీ. అనేక ప్రాంతాలను చూశారు. విభిన్న ప్రజలను కలిశారు. కానీ, భారతదేశం ఎంతో పెద్దది, గొప్పది. ఇంకా చూడాల్సినవి ఎన్నో ఉన్నాయి. లేటెస్ట్గా, రాహుల్ గాంధీ కేంద్రపాలిత ప్రాంతమైన లదాఖ్లో పర్యటిస్తున్నారు. లేహ్లో విహరిస్తున్నారు. చైనా బోర్డర్లో ఉన్న పాంగాంగ్ సరస్సు చూసేందుకు బైక్ రైడ్ చేస్తున్నారు. రాహుల్గాంధీ బైక్ నడుపుతున్న ఫోటోలను కాంగ్రెస్ పార్టీ ట్విటర్లో పోస్ట్ చేసింది.
లేహ్ నుంచి పాంగాంగ్ సరస్సుకు బైక్పై వెళ్తున్న రాహుల్ గాంధీ.. మార్గమధ్యలో స్థానికులు, యాత్రికులతో ముచ్చటించారు. వారి యాత్ర విశేషాలను, స్థానిక చారిత్రక అంశాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రదేశాల్లో పాంగాంగ్ సరస్సు ఒకటని తన తండ్రి రాజీవ్ గాంధీ చెప్పేవారని గుర్తు చేసుకున్నారు రాహుల్. ఆగస్టు 20న రాజీవ్గాంధీ జయంతిని పాంగాంగ్ సరస్సు దగ్గరే జరుపుకోనున్నారు రాహుల్గాంధీ.
గురువారమే రాహుల్గాంధీ.. లేహ్ పర్యటనకు వచ్చారు. మొదట రెండు రోజుల టూరే అనుకున్నా.. ఆ తర్వాత ఆగస్టు 25 వరకు షెడ్యూల్ పొగిడించుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత రాహుల్.. లదాఖ్ రావడం ఇదే మొదటిసారి.
అయితే, సెప్టెంబరు 10న లదాఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్- కార్గిల్ ప్రాంతంలో కౌన్సిల్ ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక నేషనల్ కాన్ఫరెన్స్తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. ఈ సమయంలో రాహుల్.. లేహ్ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. స్థానిక ప్రజలు, పార్టీ నేతలతో రాహుల్ సమావేశాలు జరుపుతున్నారు.