Vijayawada: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువ గళం పాదయాత్ర.. విజయవాడలో ప్రవేశించనుంది. సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు పాదయాత్ర విజయవాడ చేరుకోనుంది. యాత్ర కోసం టీడీపీ లీడర్లు భారీగా స్వాగతం తోరణాలు, కటౌట్లు ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు.
లోకేశ్ యాత్ర నేపథ్యంలో బెజవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కటౌట్లు,ఫ్లెక్సీలు, జెండాలు, స్వాగత తోరణాలు తొలగించాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అనుమతి కోసం కమిషనర్తో సమావేశం అయ్యేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. కానీ కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో కలెక్టర్తో భేటీ అయ్యారు. అనుమతిపై పరిశీలిస్తానని టీడీపీ నేతలకు కలెక్టర్ హామీ ఇచ్చారు.
మరోవైపు, టీడీపీలోని రాజకీయ పరిణామాలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఫ్లెక్సీల్లో ఎక్కడ కూడా ఎంపీ కేశినేని నాని ఫోటో లేకపోవడం హాట్ టాపిక్గా మారింది. అటు.. కృష్ణా జిల్లాలో యాత్ర నిర్వహణ బాధ్యతల్ని టీడీపీ నేత కేశినేని చిన్నికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది. ఇప్పటివరకు లోకేశ్ యాత్ర బాధ్యతల్ని ఎంపీలు, జిల్లా కన్వీనర్లు చూస్తున్నారు. విజయవాడలో టీడీపీ ఎంపీ నానికి కాకుండా.. ఆయన తమ్ముడి చిన్నికి బాధ్యతలు అప్పగించారు. కేశినేని నానిని టీడీపీ దూరం పెడుతోందన్న ప్రచారం ఉంది. ఇదే సమయంలో చిన్నికి యాత్ర బాధ్యతలు అప్పగించడం, ఫ్లెక్సీల్లో ఎక్కడా ఫోటో లేకపోవడంతో ఈ ప్రచారానికి బలం చేకూరుతోంది.