TTD: తిరుమలలో చిరుతల బెడద తగ్గడం లేదు. ఇప్పటికి రెండు చిరుతల్ని అటవీశాఖ అధికారులు బోనుల్లో బంధించారు. కాలి నడక మార్గంలో ప్రశాంతంగా వెళ్లొచ్చని భక్తులు ఊపిరి పీల్చుకునేలోపే.. మరో చిరుత సంచారిస్తూ కనిపించింది. మొదటి ఘాట్ రోడ్లో ఎలిపెంట్ అర్చ్ దగ్గర చిరుత సంచారంతో కలకలం నెలకొంది. శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచరించిస్తుట్టు సమాచారం అందడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు తిరుమల స్పేషల్ కాటేజ్ వద్ద ఎలుగుబంటి సంచరిస్తున్నట్టు తెలుస్తోంది.
తిరుమలలో భక్తులు కొండపైకి బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సి వస్తోంది. చిరుతలు, ఎలుగుబంట్లు భక్తుల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవలే రెండు చిరుతల్ని అటవీశాఖ అధికారులు బంధించారు. ఇప్పుడు మరో చిరుత కనిపించడం ఆందోళనకు గురిచేస్తోంది. శేషాచలం అడవుల్లో సుమారు 50 చిరుతలు ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇవన్నీ కూడా అడవి లోపల ప్రాంతంలో ఉంటాయి. కానీ ఇటీవల కొన్ని చిరుతలు బయటకు వస్తున్నాయి. కాలి నడక మార్గంలో భక్తులపై దాడికి పాల్పడుతున్నాయి.
తిరుమలగిరుల్లో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. భక్తుల సంరక్షణ కోసం టీటీడీ అధికారులు మూడంచెల వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. భక్తులు నిఘా నీడలో కాలినడక సాగించడం, చిరుతలను బంధించడం, చిరుతల సంచారంపై అధ్యయనం చేయడం వంటి వ్యూహాలు పాటిస్తున్నారు. ఈ క్రమంలో చిరుతల సంచారంపై కీలక సమాచారం సేకరిస్తున్నారు. ఇప్పటికే రెండు చిరుతల్ని బంధించిన అటవీశాఖ అధికారులు.. వీటిలో చిన్నారి లక్షితను చంపిన చిరుత ఏది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.