రాబోయే ఎన్నికల్లో ఏఏ పార్టీలతో పొత్తు ఉంటుందన్న దానిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. పొత్తుల వ్యవహారం AICC చూసుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి మైనార్టీ, మెజార్టీ అన్న తేడా ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీలో మైనార్టీలు చాలా పెద్ద పోజిషన్లో ఉన్నారని తెలిపారు. అసలు బీఆర్ఎస్ పార్టీ మైనార్టీల కోసం చేసిందేం లేదన్నారు రేవంత్ రెడ్డి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లల్లో ఒక్క పర్సెంట్ కూడా మైనార్టీలకు దక్కలేదని విమర్శించారు.
బీజేపీ, బీఆర్ఎస్ వేరు వేరు కాదని.. రెండు పార్టీలు ఒకటే అని ఆరోపించారు రేవంత్. హైదరాబాద్లో బయల్దేరిన కారు.. ఢిల్లీకి వెళ్లే సరికి కమలంగా మారుతుందన్నారు. మైనార్టీ ఓట్లను కేసీఆర్ బీజేపీకి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ప్రస్తుతం మైనార్టీలంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారని తెలిపారు.