భూముల ధరల్లో రికార్డ్ కొట్టేసిన భాగ్యనగరం.. ఇప్పుడు మరో రికార్డ్ను అందుకుంది. దేశంలోనే అత్యంత ఖరీదైన నగరాల్లో రెండో స్థానానికి చేరుకుంది. మొదటి స్థానంలో ముంబై ఉండగా, ఇతర మెట్రో సిటీస్ను క్రాస్ చేసి సెకండ్ ప్లేస్కు వెళ్లిపోయింది హైదరాబాద్. ఒకప్పుడు సామాన్యుడికి అడ్డాగా ఉండే హైదరాబాద్ ఇప్పుడు మాత్రం రెండో ఎక్స్పెన్సివ్ సిటీ ఇన్ ఇండియాగా మారిపోయింది. సొంత ఇల్లు కొనాలంటే సామాన్యుడు భరించలేనంత ఖర్చు చేయాల్సిన నగరాల్లో తెలంగాణ రాజధాని హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. భాగ్యనగరంలో సొంతిల్లు కావాలంటే నెలవారీ ఆదాయంలో 31 శాతం డబ్బు మనది కాదు అనుకోవాలని చెబుతోంది ప్రఖ్యాత ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా.
నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యంత ఖరీదైన నివాస నగరంగా దేశ ఆర్థిక రాజధాని ముంబై మొదటి స్థానంలో నిలిచింది. ఇక రెండో స్థానంలో హైదరాబాద్ నిలిచింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇల్లు తీసుకోవాలంటే, నెలవారీ సంపాదనలో సగానికి పైగా అంటే 55 శాతం డబ్బును EMI రూపంలో ఖర్చు చేయాలి. అంటే ఒక వ్యక్తి తన కుటుంబం కోసం చేసే మిగిలిన అన్ని ఖర్చులను కలిపినా, సొంత ఇంటికి కట్టే ఈఎంఐ అమౌంట్కు అవి ఈక్వల్ కావని అర్థం.
అయితే ఈ జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ, ఐటీ క్యాపిటల్ బెంగళూరు లాంటి నగరాలను వెనక్కి నెట్టి ముంబై తర్వాత నివాసయోగ్యానికి అత్యంత ఖరీదైన నగరాల్లో రెండో స్థానంలో నిలిచింది హైదరాబాద్. భాగ్యనగరంలో 31 శాతం తమ ఆదాయంలో హోమ్ లోన్ EMI కోసం కేటాయిస్తున్నారని రిపోర్ట్ చెబుతోంది. ఇక ఢిల్లీలో 30 శాతం, బెంగళూరు, చెన్నైలో 28 శాతం ఆదాయాన్ని EMIల రూపంలో చెల్లిస్తున్నారు.
ఇక ఈ లిస్ట్లో చివరి స్థానంలో నిలిచింది అహ్మదాబాద్. ఈ రిపోర్ట్ ప్రకారం దేశంలోని పెద్ద నగరాల్లో కంటే అహ్మదాబాద్లో ఇల్లు కొనడం చాలా చీప్ అనేది తేలిపోతుంది. ఇక్కడి ప్రజలు కేవలం తమ ఆదాయంలో కేవలం 23 శాతాన్ని మాత్రమే ఈఎంఐల రూపంలో చెల్లిస్తున్నారు.
ఒక కుటుంబం ఇంటి కోసం హోమ్ లోన్లో సగానికి పైగా ఈఎంఐకే కేటాయించడం అనేది భరించలేదనే చెప్పాలి. బ్యాంకులు కూడా సాధారణంగా ఇంత స్థాయి ఈఎంఐలు కట్టేలా ఉంటే లోన్లు ఇవ్వడానికి వెనుకడుగు వేస్తాయి.